మధిర టౌన్, ఏప్రిల్ 21: ప్రైవేటు హాస్పిటల్స్ కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే దవాఖానాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు. వీటిని ప్రజలంతా ఉపయోగించుకోవాలని కోరా రు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా గురువారం మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య మేళాను జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 57 రకాల వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఖమ్మం ఆస్పత్రిలో గుండె సంబంధ వైద్య సేవలు అందుతున్నాయని, క్యాత్ల్యాబ్ యూనిట్ కూడా ఏర్పాటైందని వివరించారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మం ఆస్పత్రిలోనే ఈ సదుపాయాలు, వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రిలోనే షుగర్, బీపీకి సరైన మందులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలల్లో సాధారణ ప్రసవాలకు వైద్యులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లాలో తల్లిపాల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆరోగ్య మేళాలో పులిహోర, మజ్జిగ ప్యాకెట్ల్ల పంపిణీని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ప్రారంభించారు. ఆ ఆరోగ్య మేళాలో మొత్తం 1,326 మందికి వైద్యులు, సిబ్బంది సేవలు అందించారు. డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, మెగా హె ల్త్ క్యాంప్ ఇన్చార్జ్ డాక్టర్ వెంకటేష్, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, ఎంపీపీ మెండెం లలిత, మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు.