కుత్బుల్లాపూర్, అక్టోబర్ 23: విద్యార్థులకు విక్రయించేందుకు మాదకద్రవ్యాలు తీసుకొచ్చిన ఓ ముఠా మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ అధికాలకు పట్టుబడింది. వీరి నుంచి రూ.2 కోట్లకుపైగా విలువైన మెపెడ్రోన్ను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు కీలక నిందితులు పరారీలో ఉన్నట్టు జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రయ్యగౌడ్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పట్టుబడిన నిందితుల్లో కరీంనగర్ జిల్లా చొక్కారావుపల్లికి చెందిన పవన్ అలియాస్ చిటుకూరి ప్రశాంత్రెడ్డి నుంచి 5 గ్రాములు, మహబూబ్నగర్ జిల్లా తిమ్మాయిపేటకు చెందిన కన్నారెడ్డి అలియాస్ మహేశ్వర్ నుంచి 921 గ్రాములు, నాగర్కర్నూల్ జిల్లా బవాజీపల్లికి చెందిన కొండనూరి రామకృష్ణగౌడ్ నుంచి 4 కిలోల మెపెడ్రోన్ను, కారును స్వాధీనం చేసుకొన్నట్టు వివరించారు. ఈ ముఠాలో కీలక సభ్యులైన బందం హన్మంత్రెడ్డి, సురేశ్రెడ్డి అలియాస్ ఎస్కే రెడ్డి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. గతంలో కూడా ఈ ముఠా పటాన్చెరులోని ఓ మూతపడిన గోదాంలో డ్రగ్స్ మిశ్రమాన్ని తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడినట్టు తెలిపారు.