చింతకాని, మార్చి 3: చింతకాని మండలం జిల్లాలో వాణిజ్య పంటలకు కేంద్రం అని చెప్పవచ్చు. మండలంలో మిర్చి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సుబాబుల్, పెసర, మినుములు, వరి తదితర పంటల సాగు విస్తీర్ణం అత్యధికం. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ మండలంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందుతున్నది. ఇక్కడి నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు వాణిజ్య పంటల సాగుకు అనుకూలం. ప్రస్తుతం ఈ మండలం మక్కల సాగుకు కేంద్రంగా మారింది. ఏటా మక్కల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.
మండలంలో యాసంగిలో ఎవరూ ఊహించని విధంగా 23 వేల ఎకరాల్లో మక్కల పంట సాగవుతున్నది. వర్షాకాలంలో కేవలం 451ఎకరాల్లో మాత్రమే సాగు చేసిన రైతులు యాసంగిలో పెసర, మినుములు, పత్తి సాగును పక్కన పెట్టి మక్కల సాగుకు పూనుకున్నారు. 2021-22 రబీలో 23 వేల ఎకరాలు, 2020-21 రబీలో 2 2వేల ఎకరాలు, 2019-20 రబీలో 21వేల ఎకరాలు, 2018-19 రబీలో 9 వేల ఎకరాలు, 2017-18 రబీలో 16 వేల ఎకరాలు, 2016-17 రబీలో 3వేల ఎకరాల్లో మక్కల సాగు చేపట్టారు. పంట పెట్టుబడి ఖర్చు ఎకరాకు రూ.30 వేలు అవుతుందని, పంట చేతికొచ్చిన తర్వాత రూ.30 వేల వరకు లాభాలు గడించే అవకాశం ఉందని రైతులు వెల్లడిస్తున్నారు.
మిగతా పంటలతో పోల్చితే మొక్కజొన్న సాగుకు పెట్టుబడులు తక్కువ. తక్కువ శ్రమ. లాభాలు కూడా ఎక్కువగా వస్తుండంతో రైతులు మక్కల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సంవత్సరం వానకాలంలో పత్తి పంటకు గులాబీ రంగు పురుగు ఆశించడం, పంట నష్టపోవడమూ మక్కల సాగు విస్తీర్ణం పెరగడానికి కారణాలయ్యాయి. కొందరు రైతులు చీడపీడలకు గురైన పత్తి మొక్కలను తొలగించి ఏకంగా మక్కల సాగు చేపట్టారు. పత్తి ద్వారా వచ్చిన నష్టాలను మక్కల సాగుతో పూడ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం మక్కలు క్వింటాకు రూ.1,825 మద్దతు ధర ఇస్తుండడంతో వీటి సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు.
వ్యవసాయశాఖ, సహకారశాఖ అధికారులు నాగులవంచ, చింతకాని సహకార కేంద్రాల్లో రైతులకు డిమాండ్కు తగిన ఎరువులు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పీఏసీఎస్ కేంద్రానికి రెండు లారీల యూరియా తెప్పించారు. మరో 600 టన్నుల యూరియా సరఫరా చేస్తామని వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
మండలంలో మక్కల సాగు విస్తీర్ణానికి తగినంత యూరియాను రైతులకు అందుబాటులో ఉండేలా చూస్తాం. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను వివరిస్తున్నాం. ఇప్పటికీ కొన్నిచోట్ల మక్కల విత్తనాలు నాటుతున్నట్లు తెలిసింది. పంట చేతికోచ్చే సమయంలో వచ్చే ఎండల కారణంగా పంట దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున రైతులు పెసర, మినుముల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి.- పల్లెల నాగయ్య, ఏవో, చింతకాని
సాగర్ కాల్వలపై ఆధారపడి సాగు చేస్తున్న మక్కల పంటకు పుష్కలంగా సాగునీరు అందిస్తాం. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సాగు నీటిని నిరంతరం విడుదల చేస్తాం. చివరి భూములకూ నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. వారబందీ పద్ధతిలో నీరు విడుదల చేస్తున్నాం. రైతులు సాగునీటిని వృథా చేయవద్దు.
– తొంటి సురేశ్, ఎన్నెస్పీ జేఈ