హైదరాబాద్/సిటీబ్యూరో నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల పట్ల రైల్వేశాఖ నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నది. లాక్డౌన్ అనంతరం కరోనా ఆంక్షల పేరుతో, ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్న వంకతో వివిధ వర్గాలకు దక్కాల్సిన రాయితీలను ఎత్తేసిన రైల్వేశాఖ వాటిని పునరుద్ధరించలేదు. రాయితీలకు అర్హులైనవారి నుంచి కూడా పూర్తి చార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నది. రైల్వే నిబంధనల ప్రకారం 60 ఏండ్లు నిండిన పురుషులు, 58 ఏండ్లు నిండిన స్త్రీలను సీనియర్ సిటిజన్లుగా గౌరవిస్తూ, వారికి ప్రయాణ టికెట్లపై రాయితీలు ఇవ్వాల్సి ఉన్నది. కానీ, గత ఏడాదిన్నరలో 3,78,50,668 మంది సీనియర్ సిటిజన్ల నుంచి పూర్తి చార్జీలు వసూలు చేసింది. సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్కు అధికారులు ఇచ్చిన సమాధానంతో ఈ లెక్క బయటపడింది. నిజానికి దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గిపోయినప్పటికీ, ప్రత్యేక రైళ్ల పేరుతో ప్రత్యేక బాదుడు కొనసాగుతుండటం పట్ల రైల్వే ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
రైల్వేశాఖ రెగ్యులర్ టైంటేబుల్ ప్రకారం నడపాల్సిన రైళ్లనే ప్రత్యేక రైళ్లుగా నడుపుతూ రాయితీలకు ఎగనామం పెడుతున్నది. అంతేకాకుండా డబుల్ చార్జీలు వసూలుచేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. దీనిపై రైల్వే అధికారులను వివరణ కోరగా.. కొవిడ్ నేపథ్యంలో రైల్వే రాకపోకలను నిలిపివేశామని, ఆ తర్వాత దశలవారీగా ప్రత్యేక రైళ్లు నడుపుతుండటం వల్ల వయోవృద్ధులు, వికలాంగులు, ఇతర వర్గాలకు రావాల్సిన రాయితీలు ఇవ్వడం లేదని దక్షిణ మధ్య రైల్వే జోన్ సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. దశలవారీగా ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నామని, వీటిలో అందరికీ రైల్వే టిక్కెట్లపై రాయితీ విధానం అమలవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఎస్సీఆర్ ఆధ్వర్యంలో 300 వరకు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక రైళ్లను దశలవారీగా రద్దుచేస్తున్నట్టు తెలిపారు.
సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై రాయితీలను పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. మంగళవారం ఆయన రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘ఇది చాలా దురుదృష్టకరమైన పరిస్థితి. కోట్లాది మంది సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, మీ నిర్ణయాన్ని సమీక్షించి, వారికి సహాయపడటంతోపాటు వారికి గౌరవాన్ని కల్పించండి’ అని ట్వీట్చేశారు.