తిరుపతి : టీటీడీ ఆయర్వేద ఫార్మసీ(ttd ayurveda pharmacy) నుంచి 314 నూతన ఔషధాలు తయారు చేయడానికి కసరత్తు జరుగుతోందని జేఈవో(JEO) సదా భార్గవి తెలిపారు. మొదటి విడతగా 10 రకాల ఔషధాలు తయారు చేయడానికి నరసింగాపురంలోని అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన నూతన షెడ్ ను మార్చి 31వ తేదీ ప్రారంభిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆమె ఆయుర్వేద ఫార్మసీ(ayurveda pharmacy) విస్తరణ పనులను పరిశీలించారు.
ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ, రోగులకు, ఆధునిక వైద్యం అందించడానికి అదనంగా 314 రకాల ఔషధాలు తయారు చేయాలని యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ఇందుకు అనుగుణంగా రూ.5 కోట్లతో ఫార్మసీని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫార్మసీలో ప్రస్తుతం 30 రకాల ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల 314 ఔషధాలకు ఫార్మూలాలకు ఆయుష్(Ayush) నుంచి సర్టిఫికేషన్ లభించిందని చెప్పారు. రెండవ, మూడవ విడతల్లో ఆయుర్వేద ఫార్మసీని మరింత అభివృద్ధి చేయనన్నట్లు వివరించారు.
అంతకుముందు జేఈవో నూతన యంత్రాల ఏర్పాటు, ఫార్మసీ ప్రాంగణంలో నిర్మించిన షెడ్లను పరిశీలించారు. 31వ తేదీ ప్రారంభించనున్న 10 రకాల ఉత్పత్తులకు అవసరమైన ముడి పదార్థాలతో పాటు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి ఆర్చి, సైన్ బోర్డులు, క్యాటలాగ్ తదితర అంశాలకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ లు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ , ఫార్మసీ సాంకేతిక అధికారి డాక్టర్ నారపరెడ్డి, ఈఈ మురళీ కృష్ణ పాల్గొన్నారు.