రంగారెడ్డి : పుట్టిన రోజే అతనికి చివరి రోజైంది ! స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి పార్టీ చేసుకుందామని ఉత్సాహంగా వెళ్తున్న ఆ యువకుడిపైకి గుర్తు తెలియని వాహనం మృత్యువులా దూసుకొచ్చింది. అతను వెళ్తున్న మోటార్ బైక్పై నుంచి వాహనం దూసుకెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో అతని ఇద్దరు ప్రాణ స్నేహితులు కూడా మరణించడం అందర్నీ కలిచివేస్తుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. జయవర్ధన్ (18), విష్ణు (18), వరప్రసాద్(15) ముగ్గురు మిత్రులు. జయవర్ధన్ పుట్టిన రోజు ఇవాళే కావడంతో తన జన్మదిన వేడుకల కోసం కేక్ తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీనడంతో ముగ్గురిని మృత్యువు కబలించింది. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని గుండెలవిసేలా విలపించారు. వారు రోధించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. చనిపోయిన ముగ్గురూ చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.