నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసింది. సరైన ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులకు చెందిన మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాంతో మొత్తం 11 మందిలో 8 మంది బరిలో మిగిలారు. అందులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఏడుగురు స్వతంత్ర అభ్యలు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు గడువు ఉండడంతో, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుదిజాబితా వెల్లడికానుంది. కాగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉంటారా? తప్పుకొంటారా? అనే ఉత్కంఠ ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరోవైపు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అధికారులు పోలింగ్, కౌంటింగ్లతోపాటు ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించారు. దీనిపై ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లా అధికారులతో ఎన్నికల పరిశీలకుడు అహ్మద్ నదీమ్, రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమీక్ష నిర్వహించారు.
నామినేషన్ల పరిశీలన పూర్తి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన సజావుగా ముగిసింది. బుధవారం రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ నేతృత్వంలో జరిగిన పరిశీలనలో అభ్యర్థులు వారి ఏజెంట్లు, ప్రతిపాదకులతోపాటు సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఒక్కో అభ్యర్థి నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం అన్ని ధ్రువపత్రాలు, సంతకాలు, ప్రతిపాదకులు ఉన్నారా? అనే విషయాలను పరిశీలించారు. పరిశీలనలో స్వతంత్ర అభ్యర్థులకు చెందిన మూడు నామినేషన్లు తిరస్కరిస్తున్నట్లు ఆర్ఓ ప్రకటించారు. వీరిలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన బడుగుల రవీందర్, దాచేపల్లి నాగేశ్వర్రావు, పాదూరి గోవర్ధిని ఉన్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది మిగిలారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితోపాటు స్వతంత్ర అభ్యర్థులైన కాసర్ల వెంకటేశ్వర్లు, రాంసింగ్ కొర్రా, బెజ్జం సైదులు, తండు సైదులు, ఏర్పుల శ్రీశైలం, డాక్టర్ కుడుదుల నగేశ్, వంగూరి లక్ష్మయ్య నామినేషన్లు సక్రమమేనని తేల్చారు.
ఉపసంహరణకు రేపటి వరకు గడువు
నామినేషన్ల ఉపసంహరణకు షెడ్యూల్ ప్రకారం గురు, శుక్రవారం వరకు గడువు ఉంది. రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎవరైనా అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవాలంటే ఆర్ఓకు విత్డ్రా ఫాం సమర్పించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఆర్ఓ వెల్లడించనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఉన్న సంఖ్యాబలం రీత్యా ఎవరు బరిలో నిలిచినా నామమాత్రమే కానున్నారు. మొత్తం 1271 మంది ఓటర్లలో 1050 మందికి పైగా టీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నట్లు అంచనా. మిగిలిన వారిలో కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీకి చెందిన వారు ఉన్నారు. అయితే వీరికి సంబంధించిన వారెవరూ ప్రస్తుతం అధికారికంగా బరిలో లేరు. స్వతంత్ర అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులే బరిలో ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వీరు కూడా చివరి వరకు బరిలో ఉంటారా? బలం లేనప్పుడు పోటీలో ఉండడం ఎందుకు అని భావిస్తూ తప్పుకుంటారా? అన్న చర్చ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎన్నికల పరిశీలకుడు అహ్మద్ నదీమ్ జిల్లాకు చేరుకున్నారు. ఆర్ఓ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి మూడు జిల్లాల అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు
నీలగిరి, నవంబర్ 24 : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల పరీశీలకుడు అహ్మద్ నదీమ్ తెలిపారు. బుధవారం ఎన్నిక ఏర్పాట్లుపై రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్తో చర్చించారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లపై చర్చించి సూచనలు చేశారు. కౌటింగ్కు కొవిడ్ నిబంధనలను అనుసరించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయన వెంట సహాయ రిటర్నింగ్ అధికారి వి.చంద్రశేఖర్, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, తాసీల్దార్ నాగార్జునరెడ్డి ఉన్నారు.
అహ్మద్ నదీమ్