శంషాబాద్ రూరల్, మార్చి 23: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) ఇకపై మరింత మంది ప్రయాణీకులకు సేవలందించనున్నది. తొలి దశ విస్తరణలో భాగంగా ఎయిర్పోర్టు ప్రయాణీకుల సామర్థ్యాన్ని 3.4 కోట్లకు పెంచారు. దీంతో త్వరలోనే కొత్తగా తెచ్చిన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఎయిర్పోర్టు ఆపరేటర్ జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) తెలియజేసింది. బుధవారం ఆర్జీఐఏ 14వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా దేశంలోనే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్మించిన తొలి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఆర్జీఐఏ అని జీహెచ్ఐఏఎల్ తెలిపింది. రికార్డుస్థాయిలో కేవలం 31 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఎయిర్పోర్టు.. 2008లో ప్రారంభమైంది.
మొదట్లో ఏటా 1.2 కోట్ల ప్రయాణీకుల సామర్థ్యానికి అనుగుణంగా దీన్ని నిర్మించారు. ఆ తర్వాత ఏటా 2.1 కోట్లకుపైగా ప్రయాణీకులకు సేవలందించే స్థాయికి ఎదిగింది. 2008-09లో 62 లక్షల మంది ప్రయాణీకులు రాగా.. 2019-20లో గరిష్ఠంగా 2.16 కోట్లను తాకారు. ఇక కరోనా నేపథ్యంలో ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో విమాన ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. నిజానికి కోవిడ్కు ముందు ఐదేండ్లు ఏటా 2.1 కోట్ల ప్రయాణీకులతో 15 శాతం సీఏజీఆర్ను ఎయిర్పోర్టు సాధించడం గమనార్హం. ఈ క్రమంలోనే పెరుగుతున్న ప్రయాణీకుల దృష్ట్యా 2018లో దశలవారీగా ఎయిర్పోర్టు విస్తరణకు జీహెచ్ఐఏఎల్ శ్రీకారం చుట్టింది. 4 కోట్ల ప్రయాణీకుల సామర్థ్యానికి చేర్చాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నది. దీంతో తొలి దశలో 3.4 కోట్లకు విస్తరించారు. ఎయిర్ ట్రాఫిక్ మూమెంట్ కూడా 81వేల నుంచి 1.84 లక్షలకు ఎగిసింది. ఇక ఎన్పీసీఐ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఫాస్టాగ్ కార్ పార్కింగ్ సదుపాయాన్నీ ఆర్జీఐఏనే కల్పించింది.
88 గమ్యస్థానాలకు..
ఆరంభంలో దేశ, విదేశాల్లోని 36 గమ్యస్థానాలకు ఎయిర్పోర్టు నుంచి విమానాలు నడిచాయి. ఇప్పుడు 88 గమ్యస్థానాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయని జీహెచ్ఐఏఎల్ తెలిపింది. అలాగే ఎయిర్ కార్గో వార్షిక నిర్వహణ సామర్థ్యం కూడా 56,700 మెట్రిక్ టన్నుల నుంచి 1,12,744 మెట్రిక్ టన్నులకు పెరిగింది. హైదరాబాద్ దేశానికే ఫార్మా హబ్గా ఉన్నదని, అంతర్జాతీయంగా ఇక్కడి ఔషధ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఫార్మా ఎగుమతులూ పెరిగాయని ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. మొత్తం కార్గో ఎగుమతుల్లో 70 శాతం ఔషధాలేనని చెప్పాయి. ఇక దిగుమతుల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తుల వాటా 50 శాతంగా ఉంటే, ఫార్మా 30 శాతంగా ఉన్నది.
లక్షలాది ఉద్యోగాలు
ఆర్జీఐఏ కార్యకలాపాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 8,40,800 ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. 13,500 ఉద్యోగాలు నేరుగా లభిస్తే.. పరోక్షంగా సరఫరా వ్యవస్థ ద్వారా 1,19,000 ఉపాధి, ఉద్యోగాలు వచ్చాయి. పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ద్వారా మరో 7,07,700 ఉపాధి, ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇక ఎయిర్పోర్టులో నిర్మాణ పనులతో 1,21,700 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించినట్టు ఎయిర్పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఎయిర్పోర్టు సిటీ అభివృద్ధి కార్యకలాపాలతో జాతీయ జీడీపీకి రూ.1,67,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎన్సీఏఈఆర్ చెప్తున్నది. 56,186 ఉద్యోగాలు లభిస్తాయన్నది.