న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడుతుండడంతో ఆసుపత్రులపై భారం పడుతున్నది. ఫలితంగా భారీగానే వైద్యులు సైతం వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేస్తున్నారు. పరిస్థితి విషమించి కొందరు.. ప్రాణాలు వదులుతున్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 270 మంది వైద్యులు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మంగళవారం పేర్కొంది. కరోనాతో మృతి చెందిన వైద్యుల జాబితాలో ఐఎంజీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ సైతం ఉన్నారు. మహమ్మారి బారినపడి ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు.
ఇప్పటి వరకు బిహార్లో అత్యధికంగా 78 మంది, ఉత్తరప్రదేశ్లో 37 మంది, ఢిల్లీలో 29 మంది, ఆంధ్రప్రదేశ్లో 22 మంది మరణించారు. ఐఎంఏ రిజిస్ట్రీ ప్రకారం.. మొదటి వేవ్లో 748 మంది వైద్యులు వైరస్ బారినపడి ప్రాణాలు విడిచారు. దేశవ్యాప్తంగా కరోనా మొదటి వేవ్లో 748 మంది కరోనా బారినపడి మృతి చెందారని, సెకండ్ వేవ్లో తక్కువ వ్యవధిలో 270 మంది వైద్యులను కోల్పోయామని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి రెండో దశ అందరికీ.. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ కార్మికులకు చాలా ప్రాణాంతకంగా మారుతోందని పేర్కొన్నారు.