దశాబ్దాల తరబడి కరెంటు కోతలతో తెలంగాణ ప్రాంతం అంధకారమైంది. ఎండిన పంటపొలాల సాక్షిగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అర్ధరాత్రి కరెంటు వల్ల ప్రమాదాలు, పాముకాటుకు గాల్లో కలిసిపోయిన గడ్డు రోజులు. ఆ ప్రాణాలకు అడ్డుకట్టపడిన పర్వదినం, రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన మరచిపోలేని రోజు జనవరి 1. సరిగ్గా మూడేండ్ల కిందట… 2018, జనవరి 1వ తేదీ తెలంగాణ రైతాంగానికి ఉచిత, నాణ్యమైన 24 గంటల కరెంటు పల్లకీని మోసుకొనివచ్చిన పర్వదినం. జనవరి 1 తెలంగాణ రైతుల చిరకాల స్వప్నం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటును సాకారం చేసిన పండుగ రోజు.
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ ప్రాంతానికి 6 గంటల కరెంటు. అది కూడా 2, 3, లేదా 4 విడతలు. ఆ కరెంటుతో పంటలు సరిగా పండక, పారిన మడులే మళ్లీ పారి రైతులు అరిగోస పడేది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వచ్చే త్రీ ఫేజ్ కరెంటు కోసం పొలాల వద్ద పడిగాపులు కాసేవారు. ఒక్కసారిగా మోటార్లు స్టార్టవ్వడంతో ఎగిరిపోయిన ఫ్యూజులను మార్చేక్రమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులెందరో..! పల్లెటూర్లలో పండుగలు, ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు పగటిపూట అర్ధగంట కరెంటు కోసం ఆపసోపాలు పడిన నేపథ్యం ఇప్పటికీ విద్యుత్ ఉద్యోగుల, ప్రజల మనస్సుల్లో స్పష్టంగా ఉంది.
గృహ, వాణిజ్య వినియోగదారులకు పట్టణ, నగర ప్రాంతాల్లో 4-8 గంటలు, గ్రామాల్లోనైతే 12 గంటల వరకు ఏకబిగిన కరెంటు కోతలుండేవి. ‘పవర్ హాలిడే’ కొనసాగిన దుర్భర పరిస్థితుల నుంచి దేశం మొత్తమ్మీద తొలిసారిగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించే స్థాయికి ఎదగడం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్సంస్థలు సాధించిన అపూర్వ విజయంగా పేర్కొనవచ్చు. దేవులపల్లి ప్రభాకర్రావు సారథ్యంలో జనరేషన్, సరఫరా, పంపిణీ రంగాలు రెండింతలుపైగా అభివృద్ధి చేసుకోవడం వల్లనే సాధ్యమైంది.
జనరేషన్, సరఫరా, పంపిణీ రంగాల్లో సుమారు రూ.12,610 కోట్ల వ్యయంతో 24 గంటల విద్యుత్ను అందించేందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపొందించుకున్నాం. ఏటా ఖరీఫ్ సీజన్కు ముందు రైతు చైతన్య వేదికలను నిర్వహించడమే కాకుండా, ప్రధానంగా చిన్న, మధ్యతరహా ఎత్తిపోతలపైనే ఆధారపడిన తెలంగాణ వ్వవసాయానికి 24 గంటల విద్యుత్ను అందించడాన్ని పాలసీగా ప్రారంభించిన ‘జనవరి 1’వ తారీఖును ‘తెలంగాణ రైతు విద్యుత్ దినోత్సవం’గా జరుపుకోవాలి.
(వ్యాసకర్త: అధ్యక్షులు, టీఎస్ఎస్పీడీసీఎల్, తెలంగాణ విద్యుత్ ఇంజినీర్ల సంఘం)