గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. పోలీసులకు చిక్కకుండా గూగుల్లో సెర్చ్ చేసి దొడ్డిదారులు వెతుకున్నారు. టోల్ ప్లాజాలు తగలకుండా గ్రామాల మీదుగా విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు గంజాయి చేరవేస్తున్నారు. ఆ సమయంలో కేవలం బీఎస్ఎన్ఎల్ ప్రీ పెయిడ్ సిమ్ కార్డులు మాత్రమే వాడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెంచిన ఎస్ఓటీ పోలీసులు దొడ్డిదారికి కొత్తూరులో అడ్డుకట్ట వేశారు. స్మగ్లర్లను పట్టుకుని కటకటాల్లోకి పంపారు.
సిటీబ్యూరో, జనవరి 19(నమస్తే తెలంగాణ): గంజాయి స్మగ్లర్లు గూగుల్ను నమ్ముకున్నారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వయా హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలించేందుకు కొత్త రూటును కనుగొన్నారు. పోలీసులకు చిక్కుకుండా ఈ రూట్లో గంజాయి సరఫరా చేస్తున్నారు. మొన్నటివరకు విశాఖపట్నం నుంచి విజయవాడ-కోదాడ-సూర్యపేట్-పెద్దఅంబర్పేట్- ఓఆర్ఆర్- పటాన్చెరు మీదుగా మహారాష్ట్రకు చేరుకునేది. అయితే ఈ రూటులో టోల్ ప్లాజాలు ఉండటంతో పాటు పోలీస్ చెక్పోస్టులు ఉన్నాయి. దీనికి తోడు తెలంగాణ పోలీసులు ఈ మార్గంలో తనిఖీలను ముమ్మరం చేశారు. టోల్ ప్లాజా సీసీ కెమెరాల్లో చిక్కుతున్నారు. ఇలా రాచకొండ, సైబరాబాద్ పోలీసులు వేలాది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు ఎన్ని పథకాలు రూపొందించినా.. బెడిసికొట్టాయి.
స్మగ్లర్ల చేతిలో బీఎస్ఎన్ఎల్ సిమ్..
గంజాయి సరఫరాదారులు వారి గుట్టును తెలుసుకోకుండా ఉండేందుకు రవాణా సమయంలో గంజాయి ఉన్న వాహనంతో పాటు పైలటింగ్ చేసే వాహనంలో ఉండే సభ్యులు ఫోన్ను నిరంతరం లైవ్లో పెట్టుకుంటున్నారు. గంజాయి డెలివరీ చేసే సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును వాడుతున్నారు. బయటికి వచ్చిన తర్వాత మరో కంపెనీకి సంబంధించిన సిమ్కార్డును ఉపయోగిస్తున్నారు. దీని కోసం ప్రీపెయిడ్ ప్యాకేజీలతో కూడిన సిమ్లను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా నిరంతరం ఫోన్ను ఆన్లో పెట్టడంతో పైలటింగ్ వారు మూడు కిలో మీటర్ల ముందు ఏదైనా పోలీస్ పికెటింగ్, తనిఖీలు, చెక్పోస్టులు ఉన్నట్లు గుర్తించగానే అలర్ట్ చేస్తారు. వెంటనే గంజాయి కలిగి ఉన్న వాహనం రూట్ మారుతుంది. ఇలా మహారాష్ట్రలో డంప్ అయిన తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి ప్యాక్ చేసి అధిక ధరకు ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. తెలంగాణకు చెందిన అక్రమ గంజాయి వ్యాపారులు కూడా అక్కడి నుంచి ప్యాకెట్ల రూపంలో తీసుకువచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
గూగుల్ మ్యాప్స్లో సెర్చ్..
పోలీసుల తనిఖీలను తప్పించుకునేందుకు గంజాయి స్మగ్లర్లు ‘AVOID TOLL PLAZA ROUTED FROM VISHAKAPATNAM TO MAHARASHTRA’ అని గూగుల్ మ్యాప్స్ను అడిగారు. టోల్ ప్లాజా టచ్ కాకుండా గూగుల్ మ్యాప్ చూపిన మార్గంలో గంజాయి సరఫరా చేయడం మొదలుపెట్టారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు చేరుకుని తెలంగాణకు ఎంట్రీ కాగానే గ్రామాల మీదుగా హైదరాబాద్కు చేరుకుంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో మహారాష్ట్రకు చెందిన వాహనాల్లో గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ముఠా తెలంగాణకు ఎంట్రీ కాగానే టోల్ ప్లాజా టచ్ కాకుండా గూగుల్ చూపిన రూట్ (సూర్యపేట్-మిర్యాలగూడ-హాలియా-దేవరకొండ-నల్గొండ- కల్వకురి- షాద్నగర్)లో చేరుకుంటున్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్, శంషాబాద్ ఎస్ఓటీ, కొత్తూరు పోలీసులు జాయింట్ ఆపరేషన్లో నయా రూటు స్మగ్లింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. దాదాపు రూ.69.90 లక్షల విలువ చేసే 214 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారు.