న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఐపీవో జారీకి సిద్ధమవుతున్న బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 20 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ముందస్తు అనుమతులేవీ లేకుండా ఆటోమేటిక్ మార్గంలో ఎల్ఐసీలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసేందుకు వీలుకల్పించే ఈ ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోది అధ్యక్షతన శనివారం సమావేశమైన క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి. ఎల్ఐసీ చట్టం 1956 ప్రకారం ఈ కార్పొరేషన్లో విదేశీ పెట్టుబడికి సంబంధించి ప్రస్తుత ఎఫ్డీఐ విధానంలో ఎటువంటి ప్రత్యేక నిబంధనను పొందుపర్చలేదు. అమలులో ఉన్న ఎఫ్డీఐ విధానం ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంక్ల్లో 20 శాతం వరకూ ప్రభుత్వ అప్రూవల్ మార్గంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ, ఇటువంటి ఇతర ప్రభుత్వ రంగ కార్పొరేట్లలో 20 శాతం ఎఫ్డీఐని ఆటోమాటిక్ మార్గంలో అనుమతించాలని తాజాగా క్యాబినెట్ నిర్ణయించినట్టు ఆ వర్గాలు వివరించాయి. ఈ మేరకు ఎఫ్డీఐ విధానంలో మార్పులు చేస్తారు.
స్టాక్ ఎక్సేంజీల్లో ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్ను వాయిదా వేసే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని చేరాలన్నా, బడ్జెట్ వ్యయాలకు నిధులు సమకూరాలన్నా ఎల్ఐసీ ఐపీవో కీలకం కానున్న తరుణంలో అధికారులు ఈ విషయం చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మార్కెట్లో నెలకొన్న అనిశ్చితితో ఎల్ఐసీ ఐపీవోను ప్రభుత్వం వాయిదా వేస్తుందన్న అనుమానాలు ఇన్వెస్టర్లలో పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎఫ్డీఐ పెంపుపై క్యాబినెట్ నిర్ణయం వెలువడింది. ఎల్ఐసీలో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) ఐపీవోలో ప్రభుత్వం విక్రయించడం ద్వారా రూ. 63,000 కోట్లు వరకూ సమీకరించవచ్చని అంచనా.
దేశ ప్రజల పొదుపునకు పట్టుకొమ్మగా ఉంటూ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే ఎల్ఐసీలో 20 శాతం విదేశీ పెట్టుబడుల్ని అనుమతించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఐసీ…ఎయిర్ ఇండియాలా నష్టాల్లో ఉన్న కంపెనీ కాదు. ప్రభుత్వ రంగ సంస్థల్లోనే తలమానికంగా ఉంటూ భారీ లాభాల్ని ఆర్జిస్తున్న సంస్థ. అంతేకాదు దేశంలోని సామాన్య ప్రజలకు సామాజిక భద్రత, జీవిత బీమాను అందిస్తూనే, దేశ ఆర్తిక వ్యవస్థకు, అభివృద్ధి ప్రాజెక్టులకూ క్రమం తప్పకుండా పెట్టుబడుల్ని అందిస్తున్నది ఎల్ఐసీ. ఈ సంస్థలో ఎఫ్డీఐని అనుమతించడం ప్రజలకు అందుతున్న సామాజిక భద్రతను విచ్ఛిన్నం చేయడమేనని, ఇది క్రమేపీ సంస్థను విదేశీయుల చేతుల్లో పెట్టే ప్రయత్నంలో మొదటి మెట్టుగా నిపుణులు పేర్కొంటున్నారు. పలు ప్రతిఘటనలు ఎదురైనా గతేడాది దేశీ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు ఎల్ఐసీలో ప్రాథమికంగా 20 శాతం ఎఫ్డీఐకి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కేంద్రం భవిష్యత్తులో దేశీ బీమా రంగంతో సమానంగా మెజారిటీ వాటా పొందే వీలును కూడా విదేశీయులకు కల్పిస్తుందన్న భయాలు పాలసీదార్లలో వ్యక్తమవుతున్నాయి. వచ్చే సంవత్సరం ఎల్ఐసీ ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)ను జారీచేయడం ద్వారా మరో 5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయిస్తుందన్న వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఐపీవోలోనూ, తదుపరి ఎఫ్పీవోలోనూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) పెట్టుబడి చేస్తూ, సంస్థపై పట్టును పెంచుకుంటారని విశ్లేషకులు అంటున్నారు. ఇదే రీతిలో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి భారత కార్పొరేట్ సంస్థల్లో మెజారిటీ వాటాను విదేశీ ఇన్వెస్టర్లే సంపాదించుకొని, ప్రైవేటు బీమా, బ్యాంకింగ్ రంగాల్ని దాదాపు శాసిస్తున్నారు.
ఎల్ఐసీ డిజిన్వెస్ట్మెంట్..సంస్థ కోట్లాదిమంది పాలసీదారుల ప్రయోజనాలకు భంగం కల్గిస్తుందని, సంస్థ నిర్వహణను కొద్దిమంది విదేశీ ఇన్వెస్టర్లు, స్పెక్యులేటివ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు నిర్దేశిస్తారంటూ కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఘాటుగా విమర్శిస్తూ ఇప్పటికే ఆర్థిక మంత్రి సీతారామన్కు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఎల్ఐసీకి విస్త్రతస్థాయిలో ఉన్న స్థలాలు, భూములు అధిక విలువతో కూడినవని, ప్రభుత్వ రంగ సంస్థగా ప్రజల విశ్వాసాన్ని, ప్రతిష్ఠను కలిగిఉందని, అటువంటి కార్పొరేషన్ నికర విలువను తక్కువగా గణించి, చౌక ధరలో కొద్దిమంది ఇన్వెస్టర్లకు విక్రయించడం పట్ల శర్మ విరుచుకుపడ్డారు.