న్యూఢిల్లీ: రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకుంటున్న 19 మంది ఎంపీలపై వారం రోజుల పాటు సస్పెన్షన్ విధించారు. సభకు ఆటంకం కలిగిస్తున్న కారణంగా వారిపై వేటు వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ తెలిపారు. వెల్లోకి దూసుకెళ్లిన ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. జీఎస్టీ, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్రలను వారం పాటు సస్పెండ్ చేశారు. టీఎంసీ ఎంపీలు సుస్మితా దేవ్, డాక్టర్ సంతనూ సేన్, డోలా సేన్లతో పాటు ఇతర ఎంపీలపై కూడా వారం పాటు సస్పెన్షన్ విధించారు. వేటు పడిన వారిలో కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు కూడా ఉన్నారు.
సోమవారం లోక్సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలను వర్షాకాల సమావేశాల నుంచి పూర్తిగా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సభలో ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టినందుకు వారిపై ఆ సస్పెన్షన్ విధించారు. ధరల పెరుగుదల, జీఎస్టీ లాంటి అంశాలను చర్చించాలని విపక్షాలు ఉభయసభల్లోనూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.