తిరుమల, జూన్ 21: ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం అఖండ పారాయణం చేశారు.ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సుందరకాండలోని 59 నుంచి 64వ సర్గ వరకు గల 174 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయణం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 438 రోజులు పూర్తికాగా, ఇవాల్టికి సుందరకాండ పారాయణం 376 రోజులు పూర్తి చేసుకుందని వివరించారు.15వ విడత అఖండ పారాయణంలోని 174 శ్లోకాలను ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని పర్యవేక్షణలో పివిఎన్ఎన్.మారుతి, ఎం. పవనకుమార శర్మ పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏ.వి. ధర్మారెడ్డి దంపతులు, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.