హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి ఆదివారం ఏడు ప్రత్యేక విమానాల్లో 135 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ విద్యార్థులను అధికారులు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని ఢిల్లీలోని తెలంగాణ భవన్కు తీసుకువెళ్లారు. విద్యార్థులు అక్కడ ఉండటానికి కావాల్సిన భోజనం, వసతి ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఢిల్లీకి వచ్చిన విద్యార్థులను విమానాల్లో హైదరాబాద్కు వెంటనే పంపించే ప్రయత్నం చేశారు కానీ, విమాన టికెట్లు లభ్యం కాకపోవడంతో సోమవారం హైదరాబాద్కు పంపించాలని నిర్ణయించారు. ఈ మేరకు 135 మంది విద్యార్థులను రెండు విమానాల్లో సోమవారం ఉదయం హైదరాబాద్కు పంపిస్తారు. ఇందుకు కావాల్సిన టికెట్లను అధికారులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చిన విద్యార్థులను ప్రభుత్వం స్వస్థలాలకు పంపిస్తున్నది. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను ప్రభుత్వం ఇండియాకు తీసుకువస్తున్నది. ఇలా ఇప్పటి వరకు 625 మంది తెలంగాణ విద్యార్థులు ఇండియాకు తిరిగి వచ్చారు. వారందరినీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లుచేసి స్వస్థలాలకు క్షేమంగా చేర్చింది.