పాట్నా, ఫిబ్రవరి 3: సుమారు 1200 ఏండ్ల నాటివిగా భావిస్తున్న రెండు రాతి విగ్రహాలు పాట్నా సమీపంలో లభ్యమయ్యాయి. ఇక్కడకు 88 కిలోమీటర్ల దూరంలోని ప్రపంచ వారసత్వ సంపదకు నిలయంగా పేరొందిన మహావీర్కు సమీపంలోని ఒక కోనేరులో ఇవి లభ్యమయ్యాయి. బీహార్ ప్రభుత్వం చేపట్టిన జలజీవన్ పథకంలో భాగంగా సర్లిచాక్ గ్రామంలోని తర్సిన్ చెరువులో వారం క్రితం పూడిక తీస్తుండగా రెండు రాతి విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో గ్రామస్థులు వాటికి పూజలు చేసి గుడి కట్టాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసిన పురావస్తు శాఖ అధికారులు అక్కడకు చేరుకుని విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహాల గురించి పూర్తి వివరాలు తెలియరాలేదని, 1200 సంవత్సరాల క్రితం నాటివిగా భావిస్తున్నామని అధికారి ఒకరు చెప్పారు. వీటిని నలందా మ్యూజియంకు తరలిస్తామని తెలిపారు.