హైదరాబాద్, మార్చి23 (నమస్తే తెలంగాణ): వివిధ శాఖల్లోని 80 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగార్థులకు అండగా బీసీ సంక్షేమ శాఖ కసరత్తు ప్రారంభించింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 120 చోట్ల స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయటానికి ఉన్నత విద్యాశాఖతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. స్టడీ సెంటర్ల ఏర్పాటుకు పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలను గుర్తించింది. కాగా, ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 11 బీసీ సర్కిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా స్టడీ సర్కిళ్ల ద్వారా ఉద్యోగార్థులకు ఉచితంగా వసతి కల్పించడంతో మెరుగైన శిక్షణ అందిస్తున్నది.
మూడు గదులతో ఒక్కో స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమశాఖ నిర్ణయించింది. అందులో ఒక గదిలో పోటీపరీక్షలకు డిజిటల్ పాఠాలు బోధించనున్నారు. పోటీపరీక్షలు, దానికి సంబంధించిన సిలబస్ ప్రకారం సమయాన్ని నిర్ణయిస్తారు. రెండో గదిని సందేహాల నివృత్తి కోసం కేటాయిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. మూడో గదిని ఉద్యోగార్థుల ప్రిపరేషన్కు కేటాయిస్తారు. ఆయా స్టడీ సెంటర్లలో అభ్యర్థులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తున్నది. బీసీ అభ్యర్థులే కాకుండా నిరుపేద ఉద్యోగార్థులు కూడా ఇక్కడ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావొచ్చని బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. అదీగాక స్టడీమెటీరియల్ను కూడా ఉచితంగా అందించనున్నది. ఉద్యోగార్థుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే బీసీ సం క్షేమశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నదని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా భారీమొత్తంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టడం హర్షనీయం. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోటీ పరీక్షల తర్ఫీదు కోసం ఎవరూ, ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఫీజులు కట్టాల్సిన అవసరమే లేదు. సీఎం మార్గనిర్దేశాల మేరకు స్టడీ సెంటర్లను త్వరలోనే ప్రారంభిస్తాం. డిజిటల్ వీడియోల ద్వారా శిక్షణ ఇప్పిస్తాం. పేద, మధ్యతరగతి ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
– బుర్రా వెంకటేశం, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి