న్యూఢిల్లీ: కేంద్ర పోలీస్ బలగాల వార్షిక సెలవును వంద రోజులకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సీఏపీఎఫ్ జవాన్లు తమ కుటుంబాలతో సంతోషంగా గడిపేందుకు ఏడాదిలో కనీసం వంద రోజులు వారికి సెలవు ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ వార్షిక సెలవు ప్రణాళికకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి. కేంద్రం తర్వలో దీనిపై ప్రకటన చేస్తుందని వెల్లడించాయి.
కాగా, సుమారు పది లక్షలున్న కేంద్ర పోలీస్ బలగాలకు ప్రస్తుతం ఏడాదికి సుమారు 75 రోజులు సెలవు ఇస్తున్నారు. అయితే కేంద్ర బలగాలలో ఒత్తిడిని నివారించేందుకు, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పని చేసే సిబ్బందిలో సంతోషాన్ని నింపేందుకు, ఆత్మహత్యలు, తోటి సిబ్బందిపై కాల్పులను నివారించేందుకు వారి సెలవుల సంఖ్యను వంద రోజులకు పెంచాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనపై పలుసార్లు సమావేశం జరిపింది. ఈ నెలలో జరిగిన సమావేశంలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కరోనా నేపథ్యంలో చాలా కాలంగా పెండిగ్లో ఉన్న ఈ ప్రతిపాదనను త్వరగా అమల్లోకి తీసుకురావాలని పేర్కొంది. దీంతో కేంద్ర పోలీస్ బలగాల వార్షిక సెలవులు వంద రోజులకు పెంచడంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకోనున్నదని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.