హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వచ్చే మూడేండ్లలో రూ.1,000 కోట్లతో మెడికవర్ హాస్పిటల్స్ను విస్తరించనున్నట్టు ఆ సంస్థ సీఎండీ డాక్టర్ అనిల్ కృష్ణ తెలిపారు. దీంతో మరో 3,000 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 2024 నాటికి హైదరాబాద్, పుణె, చెన్నైల్లో రెండు చొప్పున, విజయవాడ, బెంగళూరు, ముంబై, కోలాపూర్లో ఒక్కో దవాఖాన ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. దాదాపు ఇవన్నీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలేనని స్పష్టం చేశారు. వీటితోపాటు వరంగల్లోనూ 250 పడకలతో దవాఖాన ప్రారంభిస్తామన్నారు.
నిధుల సేకరణ దిశగా..
రూ.1,000 కోట్లలో 50 శాతం ఈక్విటీ రూపంలో మరో 50 శాతం రుణాల రూపంలో నిధులను సమకూర్చుకోనున్నట్లు ఈ సందర్భంగా అనిల్ కృష్ణ తెలియజేశారు. వీటికి అదనంగా త్వరలో 4-5 ఆంకాలజీ (క్యాన్సర్), పిల్లల దవాఖానలను సైతం ఏర్పాటు చేస్తామని, ఇందుకు మరో రూ.300 కోట్ల వరకు వెచ్చిస్తామని తెలిపారు. నవీ ముంబైలో 300 పడకలతో వచ్చే నెలలో దవాఖాన ప్రారంభిస్తామన్న ఆయన.. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు రూ.750 కోట్లు పెట్టుబడి పెట్టామని, అదనంగా 2,000 పడకలు ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో రెండు తెలుగు రాష్ర్టాల్లోనే దాదాపు 1,350 పడకలు, 550 వెంటిలేటర్లను అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. ఫలితంగా కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించగలిగామన్నారు. కాగా, మెడికవర్స్ గ్రూప్ పరిధిలో ప్రస్తుతం 20 దవాఖానలు ఉన్నాయని, దాదాపు అన్నీ సానుకూల వృద్ధితో బ్రేక్ ఈవెన్కు దగ్గరగా ఉన్నాయన్నారు.
అనుబంధ వ్యాపారాల వైపు..
గతేడాది టర్నోవర్ రూ.750 కోట్లు అవగా, ఈ ఏడాది రూ.1,100 కోట్లకు పెరిగిందని, వచ్చే ఏడాది రూ.1,600-1,800 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు అనిల్ కృష్ణ చెప్పారు. ఇదిలావుంటే తాము ప్రస్తుతం దవాఖాన సేవలకే పరిమితం అయ్యామని, రాబోయే మూడు, నాలుగేండ్లలో డయాగ్నోస్టిక్స్, రిటైల్ ఫార్మా, ఔషధాల ఉత్పత్తి, ఇతర హెల్త్కేర్ విభాగాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నామన్నారు. కరోనా విపత్తు ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పాఠాలు నేర్పిందని చెప్పారు. ‘వ్యాధి పక్కవాడికి మాత్రమే వస్తుంది. మనకు రాదు’ అనే భావనను విడిచిపెట్టాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకోవాలని కోరారు. తద్వారా ఆర్థికంగా నష్టపోకుండా ఉంటామని హితవు పలికారు.