సికిందర్నగర్కు చెందిన చిన్నబత్తిని బాలస్వామికి మూడెకరాల భూమి ఉండగా గతంలో పత్తి వేశాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో ప్రస్తుతం రెండెకరాల్లో పత్తితోపాటు ఎకరంలో శనగలు, ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నాడు. మంచి దిగుబడితోపాటు లాభాలు ఆర్జిస్తున్నాడు. స్వయంగా తానే మార్కెట్లో, గ్రామాల్లో అమ్ముతుండడంతో పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదిస్తున్నాడు.
మోటకొండూర్ మండలం సికిందర్నగర్ గ్రామానికి చెందిన చిన్నబత్తిని బాలస్వామి రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. చీడపీడల కారణంగా నష్టం రాగా, మరో ఎకరంలో రూ.5వేల పెట్టుబడితో సాగు చేసిన మంచి శనగ, ఆకు కూరలు, కూరగాయలు లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. పాలకూర తొలి పంటతో ఇప్పటికే రూ.25వేల ఆదాయం వచ్చింది. మూస ధోరణిలో సాగు చేస్తే నష్టాలు తప్పవని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలతో లాభాలు సాధ్యమని అనుభవపూర్వకంగా చెప్తున్నాడు.
‘ఎవుసం నవశకం పలుకాలి.. ప్రభుత్వం చెప్పిన పంటలు వేసి రైతులు తమ తలరాత తామే మార్చుకోవాలి.. సొంతంగా పెట్టుబడి పెట్టుకొనే శక్తి రావాలి. పంటలన్నీ బ్రహ్మాండంగా అమ్ముడుపోవాలి’.. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. అదే రీతిలో ఓ రైతు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించి ఆదర్శంగా నిలుస్తున్నారు. సికిందర్నగర్ గ్రామానికి చెందిన చిన్నబత్తిని బాలస్వామి పత్తిపైనే ఆధార పడకుండా విభిన్న పంటలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. నిత్యం ఒకేరకమైన పంటవేస్తే చీడపీడల కారణంగా పంట దిగుబడి తగ్గి నష్టాలు వస్తున్నాయని, అందుకే విభిన్న పంటలు సాగు చేస్తున్నానని బాలస్వామి వివరించాడు.
రైతులంతా మూస ధోరణిలో ఒకే రకమైన పంటలు సాగు చేయడంతో ఆశించిన ఆదాయం రావడంలేదు. మార్కెట్లో డిమాండ్కు మించి సరఫరా ఉండడంతో అనుకున్న ధర లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విభిన్న పంటలు సాగు చేయాలని సూచిస్తున్నది. బాలస్వామి ఏటా పత్తి సాగు చేసేవాడు. వచ్చిన ఆదాయం కాస్తా పెట్టుబడికి సరిపోవడంతో మిగులు ఏమీ కనిపించడం లేదు. ఒక్కోసారి రెక్కల కష్టం కూడా దక్కని పరిస్థితి ఎదురైంది. దాంతో పత్తికి బదులు శాస్త్రీయ పద్ధతిలో సాగు పద్ధతులను ఎంచుకున్నాడు.
విభిన్న రకాల పంటలు..
బాలస్వామి రెండెకరాల్లో పత్తి, అర ఎకరంలో శనగ, మరో అర ఎకరంలో పాలకూర, మెంతి, గంగబాయిల్, కొత్తి మీర, చిక్కుడు, బీర, కాకర, పచ్చిమిర్చి సాగు చేశాడు. వర్షాధార ప్రాంతం కావడంతో నీటిని పొదుపుగా వాడుకుంటున్నాడు. వారంలో మూడు ధపాలుగా మోతాదులో కూరగాయల పంటలకు నీరందిస్తున్నాడు. స్వయంగా తానే మార్కెట్, గ్రామాల్లో తిరుగుతూ అమ్మకుంటున్నాడు. ఎకరంలో అన్ని పంటల పెట్టుబడి కేవలం రూ.5వేలు కాగా, ప్రస్తుతం పాలకూర మొదటి పంట 500 కట్టల దిగుబడి వచ్చింది. ఒక్కో పెద్ద కట్ట రూ.5 ధరకు విక్రయించాడు. మరో మూడు సార్లు పాలకూర పంట చేతికొస్తుందని బాలస్వామి తెలిపాడు. కూరగాయలు, ఆకుకూరలు పంట వారం రోజుల్లో చేతికందుతుందని వివరించాడు. మొత్తానికి ఆకుకూరలు రెండు నెలల్లో, కూరగాయలు నాలుగు నెలల్లో దిగుబడి వస్తాయని, నిత్యం ఆదాయం ఉంటుందని తెలిపాడు.