హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో ప్రస్తుతం 66 లక్షల రైతుల ఖాతాలకు సంబంధించి 1.52 కోట్ల ఎకరాల భూమి నమోదై ఉన్నదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ధరణి రాకతో రైతులకు రిజిస్ట్రేషన్ కష్టాలు తొలగిపోయాయని చెప్పారు. కేవలం 15 నిమిషాల్లోనే రైతులకు పట్టాదార్ పాస్బుక్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో రెవెన్యూశాఖ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ.. ధరణి వల్ల 95 శాతం ప్రయోజనం చేకూరుతున్నదని, చిన్నచిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్ పెట్టుబడులకు అడ్డాగా మారిందని చెప్పారు. 2014-15లో హైదరాబాద్లో 8.27 లక్షల క్రయ, విక్రయాలు జరగగా, రూ.3 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, 2021-22లో 18 లక్షల క్రయ, విక్రయాలు జరిగి, రూ.11వేల కోట్ల ఆదాయం సమకూరిందని వివరించారు. కష్టాలొచ్చినా, వరదొలిచ్చినా కేంద్రం రాష్ర్టానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. గతంలో సంభవించిన ప్రకృతి విపత్తులకు గాను కేంద్రం రూ.7,500 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.1,125 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. హైదరాబాద్ వరదల సమయంలో రూ.240 కోట్లు ఇస్తామన్న కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్ సర్వీస్మెన్ భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.