హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఏపీలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్లోని మేడిపల్లికి భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిని రాచకొండ ఎస్వోటీ, మేడిపల్లి పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టుచేసి రూ.2 కోట్ల విలువైన 1,200 కిలోల గంజాయితోపాటు, వాహనాలను, మొబైల్ఫోన్లను సీజ్ చేశారు. పట్టుబడిన నిందితుల్లో సంతోష్, సుగురు వాసుదేవరెడ్డి, పొన్నం రాజేశ్వర్ ఉన్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. నాచారం ప్రాంతానికి చెందిన షేక్ యాసిన్ ఈ ముఠాలో ప్రధాన సూత్రధారని, అతనితోపాటు చుంచు రవీందర్, మంద మధు పరారీలో ఉన్నారని తెలిపారు.
ట్రావెల్స్ వ్యాపారంలో యాసిన్కు నష్టం రావడంతో విశాఖలోని గంజాయి సరఫరాదారులతో పరిచయాలు ఏర్పరుచుకొని ఏడాది నుంచి ఈ దందా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో యాసిన్, అతని అనుచరులు ఈ నెల 10న సీలేరు నుంచి గంజాయిని తీసుకొచ్చారని, దాన్ని వ్యాపారులకు అమ్మేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించి 1,200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారని వివరించారు.