సంగారెడ్డి, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటర్ కార్పొరేషన్… ఐఐటీ హైదరాబాద్లో ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించింది. ఈ ఇన్నోవేషన్ సెంటర్ను ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి శుక్రవారం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సుజుకీ కార్పొరేషన్ తమ దేశం వెలుపల తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్లో ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. భారతదేశం, జపాన్ దృఢమైన సంబంధానికి ఇది సంకేతంగా పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్, సుజుకీ కార్పొరేషన్ మూడేండ్లపాటు కలిసి పనిచేసేందుకు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు చెప్పారు. జపాన్,భారత్ మధ్య నైపుణ్యాభివృద్ది, మానవవనరుల మార్పిడికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఇన్నోవేషన్ సెంటర్ ఐఐటీ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుందన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్లతో కలిసి పనిచేసేందుకు సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ ఒక వేదిక కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
స్వరాజబిలిటీ జాబ్ పోర్టల్ ప్రారంభం
ఐఐటీ హైదరాబాద్ విభిన్న ప్రతిభావంతుల(పీహెచ్సీ) కోసం‘స్వరాజబిలిటీ’జాబ్ పోర్టల్
(బీటా వెర్షన్)ను గురువారం ప్రారంభించింది. విభిన్న ప్రతిభావంతుల కోసం దేశంలో మొట్టమొదటిసారిగా ఐఐటీ హైదరాబాద్, విజువల్ క్వెస్ట్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన జాబ్ పోర్టల్ను భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ విజయరాఘవన్ ప్రారంభించారు. వికలాంగులు తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు సులువుగా స్వరాజబిలిటీ పోర్టల్ను రూపొందించారు. స్వరాజబిలిటీ పోర్టల్ ప్రారంభం సందర్బంగా ప్రొఫెసర్ విజయరాఘవన్ మాట్లాడుతూ.. దేశంలో 2 కోట్ల మందికిపైగా వికలాంగులు ఉంటారని ఇందులో 70 శాతం మంది యువకులు, నిరుద్యోగులు ఉంటారని తెలిపారు. సరైన ఉద్యోగ అవకాశాలు లభించక ఇబ్బందులు పడుతున్న వికలాంగులకు ఈ పోర్టల్ సిద్దం చేసేందుకు విజువల్ క్వెస్ట్ ఇండియా సంస్థ ముందుకు రాగా ఇందుకు అవసరమై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీ హైదరాబాద్ అందజేసినట్లు చెప్పారు. కొటక్ మహీంద్రా బ్యాంకు అవసరమైన నిధులు సమకూర్చిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వికలాంగులకు సులువుగా ఉద్యోగాలు లభించేందుకు స్వరాజబిలిటీ పోర్టల్ ఉపయోగపడుతుందన్నారు. వికలాంగులను నియమించుకోవాలనే సంస్థలకు స్వరాజబిలిటీ పోర్టల్ స్టాప్షాప్లా పనిచేస్తుందన్నారు.