హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సంస్థ లాభాల బాటలో పరుగులు పెడుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి ఏడు నెలల్లోనే రూ.868 కోట్ల లాభాలు సాధించి రికార్డు నెలకొల్పింది. ఇదే సమయంలో సంస్థ రూ.14,067 కోట్ల టర్నోవర్ సాధించింది. గతేడాదితో పోల్చితే లాభాల్లో 177 శాతం, టర్నోవర్లో 65 శాతం వృద్ధి నమోదైందని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. గత ఏడు నెలల్లో సంస్థ కార్యకలాపాలపై శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్ – అక్టోబర్ మధ్యలో సంస్థ రూ.8,537 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ ఏడాది అదే సమయంలో రూ.14,067 కోట్ల అమ్మకాలు జరిపిందని తెలిపారు. కరోనా వల్ల బొగ్గు అమ్మకాలు, రవాణా తగ్గడంతో గతేడాది సంస్థకు రూ.1,129 కోట్ల నష్టాలు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణా, విద్యుత్తు అమ్మకాలు భారీగా పెరగడంతో రూ.868 కోట్ల లాభాలను సాధించగలిగామని శ్రీధర్ వివరించారు.