రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1939, నవంబర్ 17న, నాజీ సైనికులు చెకోస్లోవేకియా దేశాన్ని ఆక్రమించిన సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ ప్రేగ్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా 9 మంది విద్యార్థులు,ఉపాధ్యాయులు మరణించారు. 1200 మంది విద్యార్థులను కాన్సెంట్రేషన్ కేంద్రానికి తరలించారు. ఈ నిరసనను పురస్కరించుకొని ఏటా ఇదేరోజున ప్రపంచ విద్యార్థుల మధ్య స్నేహం, ఐక్యత కోసం 1941నుంచి అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం జరుపుకొంటున్నారు.
2019 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 601 మిలియన్ల మంది సెకండరీ విద్యనభ్యసించారు. 3.74 కోట్ల మంది కళాశాల విద్య చదువుతున్నారు. 37.4 మిలియన్ల మంది మన భారత్లో 2019లో ఉన్నతవిద్యలో చేరారని నివేదికలు చెప్తున్నాయి. ఫిన్లాం డ్, స్వీడన్, నార్వే , డెన్మార్క్, బెల్జియం, అమెరికా, బ్రిటన్ , క్యూబా వంటి దేశాలతో పాటు వైద్యవిద్యలో ఫిలిప్పైన్స్ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందువల్ల మనదేశంలో ఉన్నత, ధనిక వర్గాల వారు విదేశీ విద్య కోసం పరుగులు పెడుతున్నారు. మేధోవలస జరుగుతున్నది. భారత పౌరులకు వివిధ రంగాల్లో నోబెల్ బహుమతి అందని ద్రాక్షగా గత దశాబ్దాల తరబడి మనకు కనపడుతున్నది. వైద్య, సాంకేతిక పరిజ్ఞానం, వసతులు పెరగాలి. ప్రభుత్వాలు విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా సిలబస్, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రోత్సహించాలి. సెల్ఫోన్, ఇంటర్నెట్, టీవీ, ఆన్లైన్ గేమ్స్ వంటి వాటికి యువత, విద్యార్థులు దూరంగా ఉండాలి.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా పిల్లలు భవిష్యత్తుపై దృష్టిసారించాలి. మార్కులు, గ్రేడులే కాకుండా నైతిక, మానవతా విలువలు పెంచేవిధంగా కృషిచేయాలి. సమాజసేవ, దేశభక్తి వంటి లక్షణాలు పెంపొందించాలి. సెల్ఫోన్తో ఒంటరి జీవితాలు ఎక్కువగా గడుపుతూ, నిజజీవితంలో అనేక అంశాలు, పరిణామాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు, స్నేహితుల వలె రోజూ కొద్దిసేపు తమ పిల్లలతో గడపాలి. జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనేశక్తి సామర్థ్యాలు నేర్పాలి. సంపాదనే ధ్యేయంగా పెంచరాదు. వారిని సంస్కారవంతులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి. కొవిడ్ కాలంలో మానవతా విలువలు మంటగలిశాయి. ఇవి గుణపాఠాలుగా, భవిష్యత్తులో వృద్ధాప్య ఆశ్రమాలు తగ్గేవిధంగా ప్రస్తుత బాలలకు, విద్యార్థులకు తర్ఫీదునివ్వాలి. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు, ఆలోచనలకు బీజం వేయాలి.
పిల్లలు చదువు, ఎదుగుదల, ఆరోగ్యం, అలవాట్ల పట్ల తల్లిదండ్రుల పాత్ర కీలకం. ఫీజులు కట్టి చదివించటమనే భావన పక్కనపెట్టి వాస్తవ పరిస్థితి అర్థమయ్యేరీతిలో పెంచాలి. ఉపాధ్యాయులూ పరిశీలన చేయాలి. డబ్బు సంపాదనే ధ్యేయంగా పెంచరాదు. నైతిక విలువలు నూరిపోయాలి. శాస్త్రీయ దృక్పథానికి పునాది వేయాలి. విదేశాల్లో జాత్యహంకారంతో ఇతర దేశాల వారిపై స్థానిక విద్యార్థులు దాడిచేయడం, కాల్చిచంపడం జరుగుతున్న ది. ఇది అత్యంత హేయమైన చర్య. ఆ భావనలు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేయాలి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నట్లు విద్యార్థులారా.. కలలు కనండి.. నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి. విజ్ఞానంతోనే జాతి జాగృతమవుతుంది. మానవ సంబంధాలు మెరుగుపడతాయి. నూతన ఆవిష్కరణలు జరిగి, మేలైన జీవనయాత్రకు మైలురాయి పడుతుంది. ప్రపంచమంతా వసుదైక కుటుంబంగా వర్ధిల్లుతుంది. ఇదే ఈ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవ పరమార్థం.
ఐ.ప్రసాదరావు