అగ్రహీరో రవితేజతో కలిసి తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం నిర్మించబోతున్నాం అని ప్రకటించారు తమిళ హీరో విష్ణు విశాల్. ఆయన కథానాయకుడిగా రవితేజ సమర్పణలో నిర్మితమైన ‘ఎఫ్ఐఆర్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ తెలుగులో విడుదల చేసింది. తాజాగా ‘ఎఫ్ఐఆర్’ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత విష్ణు విశాల్ మాట్లాడుతూ…‘మా చిత్రానికి తెలుగు, తమిళంలో మంచి స్పందన వస్తున్నది. పోస్టర్ చూసి కొందరు ముస్లిం సోదరులు ఇబ్బంది పడ్డారని తెలిసింది. వాళ్లకు మా క్షమాపణలు. సినిమా చూస్తే మీరు అర్థం చేసుకుంటారు. త్వరలో రవితేజ నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్ వర్క్స్ లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని నిర్మించనున్నాం. వివరాలు తెలియజేస్తాం’ అన్నారు.