స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలైంది. ఉమ్మడి జిల్లాలో ఖాళీకానున్న రెండు స్థానాలకు
నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. అయితే తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ 23వ తేదీ వరకు కొనసాగనుండగా.. 24న పరిశీలన, 26తో ఉపసంహరణ గడువు ముగియనున్నది. డిసెంబర్10న ఎన్నికలు, 14న లెక్కింపు చేపట్టనున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. కౌంటింగ్ మాత్రం మహబూబ్నగర్లోనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఓటేసే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 1445 (644 మంది పురుషులు, 801 మంది మహిళలు) మంది ఉన్నారని అధికారులు ప్రకటించారు. గులాబీ పార్టీ నుంచి 1,039 మంది, కాంగ్రెస్ నుంచి 241 మంది, బీజేపీ నుంచి 119 మంది, ఇతరులు 46 మంది ఉన్నారు.
మహబూబ్నగర్ నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఖాళీ అవుతున్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైనది. అయితే తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల స్వీకరణ కోసం మహబూబ్నగర్ కలెక్టర్ ఛాంబర్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు వ్యవహరిస్తున్నారు. నామినేషన్ వేసే వారు తప్పనిసరిగా మహబూబ్నగర్ కలెక్టరేట్కు రావాల్సి ఉంటుంది. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 23వరకు ఉంటుంది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన, 26వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 1445 మంది ఉన్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. అందులో 644 మంది పురుషులు, 801 మంది మహిళా ఓటర్లున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1445 మంది ఓటర్లలో ఎన్నికల సందర్భంగా గుర్తులపై ఎన్నికైన వారిలో 1039 మంది టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులున్నారు. కాంగ్రెస్ నుంచి 241 మంది, బీజేపీ నుంచి 119 మంది, ఇతరులు 46 మంది ఉన్నారు. అయితే అప్పట్లో ఎన్నికల తర్వాత అనేక మంది ఎంపీటీసీలు అధికార పార్టీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం ప్రతిపక్షాలకు అందనంత స్థాయిలో ఉంది. రెండు స్థానాల ఎన్నికలకు ఒకే బ్యాలెట్ పేపరు ఉంటుందని అధికారులు తెలిపారు. అందులో మొదటి, రెండో ప్రాధాన్య ఓట్లు అధికంగా పొందిన వారు ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5 జిల్లా కేంద్రాలతో పాటు కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తితో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న షాద్నగర్, కొడంగల్ లోనూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే కౌంటింగ్ కేంద్రం మాత్రం మహబూబ్ నగర్ లో మాత్రమే ఉంటుంది. స్థానిక సంస్థల ఓటర్లలో మెజారిటీ ఓటర్లు అధికార పార్టీ తరఫునే ఉండటంతో ప్రతిపక్షాలు పోటీకి జంకుతున్నాయి. సాధ్యమైనంత త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ నేతల ద్వారా తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరి పదవీకాలం వచ్చే జనవరి 4న ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.