హైదరాబాద్ : నగరంలో వరద కష్టాలను తొలగించేందుకు నాలాల విస్తరణ, సమగ్ర అభివృద్ధికి జీహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు మంత్రి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని అన్ని జోన్లలో త్వరలో ప్రారంభించనున్న నాలాల అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతోందని, దశాబ్దాలుగా నాలాలు కుచించుకుపోయాయన్నారు.
వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఒకేసారి కుండపోతగా కురుస్తున్నాయని, వీటితో గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరంలోని అనేక ప్రాంతాలకు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో నాలాల విస్తరణ, బలోపేతం ఆవశ్యకమైన కార్యక్రమంగా మారిందన్నారు. వరదలతో భవిష్యత్లో నగర పౌరులకు ఎలాంటి నష్టం జరుగకుండా చూడాలన్న ప్రాథమిక ఉద్దేశంతో కార్యక్రమాన్ని మరింత సమగ్రంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
నాలాల విస్తరణతో ప్రభావితమయ్యే పేదల విషయంలో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తుందని, వీరిలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. నాలాలు, చెరువుల రక్షణ అభివృద్ధి కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో నాలాల విస్తరణపై సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు.
త్వరలోనే చేపట్టనున్న నాలాల అభివృద్ధిపై జోనల్ కమిషనర్లు సమావేశంలో వివరాలు అందించారు. ఇప్పటికే ఆయా నాలాల్లో ఉన్న అడ్డంకులు, విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణం అంశాలపై క్షేత్రస్థాయిలో సిబ్బంది సర్వే చేసి, రూపొందించిన నివేదికలపై జోనల్ కమిషనర్లు మంత్రికి వివరించారు. కార్యక్రమాన్ని ఎస్ఎన్డీపీ సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు.
మొదటి దశలో చేపట్టే నాలాల విస్తరణతో పాటు ప్రతిసారి భారీ వర్షాలతో వరద కారణం అవుతున్న బాటిల్ నెక్స్ను గుర్తించి, విస్తరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.