బోనకల్లు, ఏప్రిల్ 2: యాసంగి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్ర మంత్రులు చెప్పడం బాధాకరమన్నారు. దీని వెనుక కార్పొరేట్ శక్తులు దాగి ఉన్నాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో దేశం ఉండటం శోచనీయమన్నారు. శనివారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, చిరునోముల గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.