ఇక్ష్వాకుల సామంతులుగా, లేదా స్థానిక అధికారులుగా ఉన్న విష్ణుకుండి వంశస్థులు తెలంగాణలో నల్లమల ప్రాంత అమ్రాబాదు ఏలికలు. ఇక్కడి నుంచి విష్ణుకుండి రాజ్య విస్తరణ నదిని దాటి అడవుల మీదుగా సాగలేదు. ఉన్నదొక్కటే మార్గం- ఉత్తరానికి కృష్ణా- మూసీ పరీవాహక ప్రాంతానికి విస్తరించడం. అంటే నాగర్ కర్నూల్, హైదరాబాద్, నల్గొండ ప్రాంతాల్లోకి విస్తరించడం. అందుకే హైదరాబాద్, కీసరగుట్ట, ఘట్కేసర్, తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) ప్రాంతాల్లో విష్ణుకుండి రాజ్య తొలి ఆనవాళ్లు పురావస్తు రూపంలో దొరుకుతున్నాయి.
తుమ్మలగూడెం విష్ణుకుండి రాజ్య తొలి రాజధాని అనే ఆధారాలున్నాయి. ఇక రెండో ఆధారం, విష్ణుకుండి రాజులు శ్రీ పర్వత స్వామి భక్తులమని చెప్పుకొన్నారు. అంటే శ్రీశైల మల్లికార్జునుడి భక్తులైనా కావాలి లేదా శ్రీ పర్వతంను విజయపురి అనుకుంటే అక్కడి దేవుడు బుద్ధుడైనా కావాలి. ఏదైనా కృష్ణా తీరం నుంచే రావాల్సి ఉంటుంది. కొందరు అమ్రాబాదు, ఉమామహేశ్వరం వంటి ప్రదేశాల్లో ఆధారాలున్నట్టు రాస్తున్నప్పటికీ, ఇప్పటికీ సరైన పురావస్తు ఆధారాలను వెతకాల్సిన పని మిగిలే ఉన్నది. వంశం పేరు గోత్రం పేరిట వచ్చిందే. వీరి గోత్రం విష్ణుకుండి. సరిగ్గా ఇదే కాలంలో దక్కనులో ఎదుగుతున్న ఇంకో రాజవంశమైన వాకాటకులది విష్ణువ్రిద్ధ గోత్రం. ఈ కాలంలో పెరుగుతున్న వైదిక ప్రభావానికి ఉదాహరణగా విష్ణుకుండి, వాకాటకులను చూడొచ్చు. బ్రాహ్మణ కులంగా చెప్పుకొన్న వీరు క్షాత్ర ధర్మాన్ని చేపట్టి రాజులైనందున విష్ణుకుండి రాజుల పేర్ల చివర ‘వర్మ’ అనీ, వాకాటకుల పేర్ల చివర ‘సేన’ అని చేరింది. ఇది బ్రాహ్మణులు రాజులు కావడానికి క్షత్రియులుగా మారుతున్న పద్ధతిని చూడొచ్చు. అందుకే ఇలాంటి బ్రాహ్మణ-క్షత్రియ రాజుల వర్ణనలో ‘బ్రాహ్మక్షాత్ర’ పదం వచ్చింది.
యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెంలో దొరికిన శాసనాలు విష్ణుకుండి చరిత్రకు కీలకమైనవి. ఇక్కడి రెండు తామ్రశాసనాల గుదులలో (bunches) ఒకటి మూడవ వాడైన మొదటి గోవిందవర్మ సంస్కృత శాసనం. ఇప్పటికి దొరికిన విష్ణుకుండి శాసనాల్లో ఇది మొదటిది. ఈ శాసనం ఉన్న ఐదు రాగిరేకులు ఈ శాసనం బౌద్ధ సంఘానికి చేసిన దానం గురించి చెప్తుంది. ఇంద్రపురంలో ఉన్న గోవిందవర్మ పట్టమహిషి పరమభట్టారికా మహాదేవి నిర్మించిన పరామభట్టారికా మహా విహారంలోని ఆర్య సంఘానికి (బౌద్ధ సంఘం) ‘ఎర్మదల’ ‘పేన్కపర’ గ్రామాలను దానమిచ్చినట్టు ఉంది. ఈ దానం వైశాఖ పూర్ణిమ అంటే బుద్ధ పూర్ణిమరోజు చేసినట్టు ఉంది. గోవిందవర్మ పాలనాకాలంపై వేర్వేరు అభిప్రాయాలున్నాయి. అజయ్ మిత్ర శాస్త్రి ప్రతిపాదన క్రీ.శ.435-475 మధ్య ప్రామాణికంగా చెప్పవచ్చు. ఏపీలో వేల్పూరు, ఈపూరు, రామతీర్థం, చిక్కుళ్ళ మొదలు పొలమూరు వరకు అన్ని శాసనాలు తుమ్మలగూడెం శాసనాల తర్వాతివే.
తుమ్మలగూడెంలో దొరికిన రెండో తామ్రపత్ర శాసనం క్రీ.శ.566లో విష్ణుకుండి రాజు రెండో విక్రమేంద్ర వర్మది. ఈ శాసనంలోనూ బౌద్ధ సంఘానికి ‘ఇరుండ్డేరో’ గ్రామాన్ని దానమిచ్చినట్టు ఉంది. ఈ రెండు శాసనాలలో ‘ఇంద్రపుర’, శుక్రభిధానపుర ప్రస్తావన ఉన్నది. ఈ రెండూ ఒక ఊరి పేర్లే అని ఒప్పుకొన్నపటికీ ఎక్కడ ఉందనే విషయంలో తేడాలున్నాయి. నేలటూరు వెంకటరమణయ్య అవి రెండూ గుంటూరు మండలంలోని అమరావతియనియే తోచుచున్నదని రాయడంతో తుమ్మలగూడెం శాసనంలో దొరికిన ఇంద్రపురాన్ని అమరావతికి జోడించడం జరిగింది. బీఎన్ శాస్త్రి మాత్రం ఈ తుమ్మలగూడెమే ఇంద్రపురమని తేల్చారు. విష్ణుకుండి రాజధాని ఇంద్రపురాన్ని గుంటూరు జిల్లా వినుకొండగా, లేక వేల్పూరుగా గుర్తించే వృథా ప్రయాస జరిగింది. వేల్పూరు రాజధాని కాదని స్కంధావారమేనని ఆధారాలు చెప్తున్నాయి.
ఈ వ్యాసం రాసే క్రమంలో డాక్టర్ దామరాజు సూర్యకుమార్తో జరిపిన క్షేత్ర, శాసన పరిశీలనలు తుమ్మలగూడెమే ఇంద్రపురమని తేల్చినయి. క్రీ.శ. 5, 6 శతాబ్దాల్లో విష్ణుకుండి శాసనాల్లో చెప్పిన ఇంద్రపురం 16, 17 శతాబ్దపు శాసనాల్లో కూడా ఆ ప్రాంతంలోనే కనిపిస్తుంది. ఇబ్రహీం కులీ కుతుబ్షా పాలనలో 1554 నాటి పానగల్ శాసనంలో పానుగంటి ఉదయసముద్రం కాలువ ఇందుపురేల సీమ అని రాసి ఉంది. తుమ్మలగూడెంలోనే దొరికిన 17వ శతాబ్దపు శాసనంలో వేలూరి లక్ఖరాజు నాగయ్య కుమారుడు త్రెమ్మయ యిందుపురం కేశవనాథని శేవ అని ఉంది. అంటే విష్ణుకుండి నుంచి కుతుబ్షాహీ వరకు తుమ్మలగూడమే ఇంద్రపురం అనడానికి ఇది నిరంతరత ఆధారం. ఇప్పటికి కూడా తుమ్మలగూడెం గ్రామ పెద్దల వంశంలో పేరు వెనక ఇంద్రపాల్ అని రాసే ఆచారం ఉన్నది.
ఈ రెండు శాసనాల్లో చెప్పిన ఊర్లను, ఎస్.శంకరనారాయణన్ ‘ఎర్మదల’ను ఎర్రబలిగూడగా, ‘పేన్కపర’,ను పంకబండ, లేదా పంకరగా గుర్తించారు.‘ఇరుండ్డేరో’ను మాత్రం గుర్తించలేదు. ఇన్ని ఆధారాలున్నందునే బీఎన్ శాస్త్రి తుమ్మలగూడెం పేరును ఇంద్రపాలనగరంగా మార్పించారు.
తుమ్మలగూడెంలో విష్ణుకుండి ఆనవాళ్లను వెలికితీసే ప్రయత్నమే జరగలేదు. 1940 దశకంలో ఖ్వాజా మహమ్మద్ అహ్మద్ తుమ్మలగూడెం, దాని పక్కనున్న నాగారం, ఆ ప్రాంత ముత్యాలమ్మ గుడి దగ్గర ఇటుకలు దొరుకుతున్నయని, చారిత్రక యుగం ఆనవాళ్లున్నాయని రాశారు. తామ్ర శాసనాలు దొరికినప్పటి నుంచి ఒక్కసారే 1980 దశకంలో ఆర్కియాలజీ శాఖ సర్వే చేసింది.
మరి శాసనాల్లో ఉన్న బౌద్ధ విహారం లేక నాటి ఆవాస స్థలాల ఆనవాళ్లు ఏమై పోయినట్టు? ఈ మధ్యే పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా) బృందం చేసిన ఉపరితల పరిశీలనలో బౌద్ధ స్తూపానికి చెందిన ఇటుకల వంటివి తుమ్మలగూడెం గుట్టపై లభించాయి. అంతేకాకుండా ఇప్పటివరకు చదవని ఒకటి లేదా రెండు శాసనాలు సైతం రికార్డు చేశారు.
మూసీ నది ఒడిలో పుట్టిన చారిత్రక గ్రామం తుమ్మలగూడెం. ఇక్కడి పొలాల్లో ఈ మధ్య ఒక పెద్ద బృహత్ శిలాయుగపు సమాధి కనిపించింది. గుట్ట మీద ఇప్పటికీ రాతితో నిర్మించిన డాల్మేన్ సమాధి కొంచెం చెదిరిపోయి ఉన్నది. ఇక్కడ నేల పొరల్లో విష్ణుకుండి కాలంనాటి ఇటుకలున్నాయి. విష్ణుకుండితో మొదలై, రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ, కుతుబ్షాహీ శాసనాలు.. ఈ చరిత్రకు చెదరని సాక్ష్యాలు. గుట్ట పైభాగంలో కోట ఉంది. రాతి గుండ్లపై 10వ శతాబ్దపు జైన తీర్థంకరుల బొమ్మలు న్నాయి. చాళుక్య, కాకతీయ కాలపు మందిరాలున్నాయి. ఇంత ఘన చరిత్ర ఉన్న గ్రామంలో, దానిచుట్టూ పక్కల పరిశీలన, పరిశోధన, తవ్వకాలు జరగక పోవడానికి వివక్షే కారణమా? తుమ్మలగూడెం అలియాస్ ఇంద్రపాల నగరం తన రహస్యాలను మనతో పంచుకునేందుకు ఇంకా వేచి ఉంది.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000