అదనపు సిబ్బందిని రప్పిస్తున్న టీటీడీ
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ప్రభావం పూర్తిగా తొలిగిపోవడం, వరుస సెలవులు ఉండడం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్నది. దీంతో భక్తులకు అసౌకర్యం కలుగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. కొవిడ్ నేపథ్యంలో వివిధ విభాగాలకు పంపిన సిబ్బందిని తిరిగి రప్పిస్తున్నది. ఇప్పటికే బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ అధికారులు అధికసంఖ్యలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అన్నప్రసాదాలు, కాఫీ, పాలు, సురక్షిత తాగునీరును భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఆరోగ్య, విజిలెన్స్ విభాగంలో అదనంగా 100 మంది, తలనీలాల కోసం 1200 మంది క్షురకులు సేవలందిస్తున్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి, ఏపీ మంత్రి గుమ్మానూరు జయరామ్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, తెలంగాణ ఎమ్మెల్సీ విఠల్ దండే, ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మహాద్వారం వద్ద ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తీర్థప్రసాదాల అనంతరం శేషవస్త్రంతో సతరించారు. తర్వాత శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా సందర్శించారు.