న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న పంజాబ్కు చెందిన ఇద్దరు రైతులు బుధవారం మృతి చెందారు. ఇందులో ఒకరికి కరోనా వైరస్ సోకిందని అధికారులు బుధవారం తెలిపారు. మృతులు బల్బీర్ సింగ్ (50), మహేందర్ సింగ్ (70) పంజాబ్లోని పాటియాలా, లుధియానా నివాసులని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ సరిహద్దుకు సమీపంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల బృందంలో వీరున్నారని పేర్కొన్నారు. బల్బీర్ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు సోనిపట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జస్వంత్ సింగ్ పూనియా తెలిపారు. అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించగా.. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ సోకినట్లు తేలిందని పేర్కొన్నారు.
అయితే, ఆరోగ్యశాఖ అధికారుల నుంచి తమకు నివేదిక అందలేదని రాయ్ స్టేషన్ ఎస్హెచ్ఓ బిజేందర్ సింగ్ తెలిపారు. మహేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని, అతని మరణానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియదని కుండ్లి ఎస్హెచ్ఓ రవికుమార్ పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని గత ఆరు నెలలుగా పంజాబ్, హర్యానా, ఇతర ప్రాంతాలకు చెందిన వేలాది మంది రైతులు సింగు, తిక్రీ, ఢిల్లీ సరిహద్దు పాయింట్లలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పలుసార్లు కేంద్రం, రైతు సంఘాలతో చర్చలు జరిగినా.. కొలిక్కి రాలేదు.