హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 నోటిఫికేషన్కు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. గతంలో ప్రకటించిన మైనార్టీ సంక్షేమాధికారుల పోస్టులను గ్రూప్-1 నుంచి తొలగించింది. ఇవి ఆరు పోస్టులుండగా, వాటి స్థానంలో కొత్తగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 పోస్టులను చేర్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీచేసినట్టు తెలిసింది. జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి (డీఎండబ్యూవో) పోస్టులను గతంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయలేదు.
డిప్యూటేషన్, ఫారిన్ సర్వీసెస్పై మరో శాఖ నుంచి అధికారులను ఆయా పోస్టుల్లోకి తీసుకొనేవారు. తాజాగా గ్రూప్-1లో చేర్చినా, భర్తీ చేసేందుకు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే ఆరు పోస్టులను ఉపసంహరించినట్టు అధికారులు తెలిపారు. తాజా మార్పుతో గ్రూప్-1 నోటిఫికేషన్లో మున్సిపల్కమిషనర్ గ్రేడ్-2 పోస్టులు 41కి చేరాయి. పోలీసు శాఖలోని డీఎస్పీ కమ్యూనికేషన్ పోస్టుల విద్యార్హతలపైనా ఆ శాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. ఇక గ్రూప్ -1కి ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో నోటిఫికేషన్ జారీకి మార్గం సుగమం అయ్యింది.
త్వరలో నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాల ముల్యాంకనంపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకొన్నది. మెయిన్స్ జవాబు పత్రాలను యూనివర్సిటీ ప్రొఫెసర్లతో ముల్యాంకనం చేయించాలని నిర్ణయించింది. ఒక్కో పేపర్ను ఇద్దరు ప్రొఫెసర్లు దిద్దనున్నారు. ఇద్దరు వేసిన మార్కులను పరిగణనలోకి తీసుకొని సరాసరిగా మార్కులేసి ఫలితాలను ప్రకటిస్తారు.
గ్రూప్-1లో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. మూల్యాంకనం, ఫలితాల ప్రకటనలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేవు. మెయిన్స్ వ్యాసరూప ప్రశ్నలు కావడంతో వాటిని ప్రొఫెసర్ల చేత దిద్దించాలని నిర్ణయించారు.