హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా జరిగిన 65వ ఎస్జీఎఫ్ఐ జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో రాష్ట్ర గురుకుల విద్యార్థులు అదరగొట్టారు. ఫ్రాన్స్లో మే నెలలో జరిగే వరల్డ్ స్కూల్ టోర్నీకి సన్నాహకంగా జరిగిన ఈ చాంపియన్షిప్లో గురుకులాలకు చెందిన అథ్లెట్లు నాలుగు స్వర్ణాలు సహా రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలతో మెరిశారు. బాలికల 100మీ, 200మీటర్ల విభాగంలో మాయవతి రెండు స్వర్ణాలు దక్కించుకుంది. బాలికల 3000మీటర్ల రేసులో మన్ననూర్ గురుకుల విద్యార్థి మల్లిక కాంస్యం ఖాతాలో వేసుకుంది. బాలుర ట్రిపుల్ జంప్లో రజతం కైవసం చేసుకున్న ప్రణయ్(జైపూర్) లాంగ్జంప్లో కాంస్యం సొంతం చేసుకున్నాడు. బాలుర పారా (టీ-35) 100మీటర్ల విభాగంతో పాటు జావెలిన్త్రోలో రవికిరణ్ రెండు పసిడి పతకాలు సాధించాడు. బాలుర 100మీటర్ల విభాగంలో రజతం ఖాతాలో వేసుకున్న గణేశ్ 200మీటర్ల కేటగిరీలో కాంస్యం దక్కించుకున్నాడు. మొత్తంగా జాతీయస్థాయి టోర్నీలో మన గురుకుల విద్యార్థులు సత్తాచాటి ప్రతిభ చాటారు.