సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి ఎర్రచందనం తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఒక ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్, కంచన్బాగ్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి రూ.75 లక్షల విలువజేసే 500 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బషీర్బాగ్లోని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీ కార్తికేయ, టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి వివరాలను వెల్లడించారు. కడప జిల్లా పొద్దుటూర్కు చెందిన షేక్ అబ్దుల్లా మొదట్లో ఐస్క్రీమ్ వ్యాపారి. అనుకున్న పురోగతి లేకపోవడంతో రియల్ ఎస్టేట్లోకి దిగాడు.
అందులోనూ అనుకున్న డబ్బు సంపాదించలేకపోయాడు. ఇక డబ్బు ఈజీగా సంపాదించేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలనుకున్నాడు. కడపకు చెందిన రవిచంద్ర ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు. అతడిపై అక్కడ కేసులు కూడా ఉన్నాయి. రవి చంద్రను సంప్రదించిన షేక్అబ్దుల్లా.. అతడి వద్ద నుంచి తక్కువ ధరకు 500 కిలోల ఎర్రచందనం (25 దుంగలు) కొనుగోలు చేశాడు. తనకు తెలిసిన సివిల్ కాంట్రాక్టర్ సహాయంతో లారీలో ఎండుగడ్డి మాటున జడ్చర్ల వరకు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఎక్కడ దాచాలో తెలియలేదు. దీంతో కల్వకుర్తిలో ఉన్న తన స్నేహితులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇనాయత్ ఖాన్, అబ్దుల్ ఖదీర్ను సంప్రదించాడు.
తమ వద్దకు తీసుకొస్తే ఇక్కడే దాచిపెడుదామని వారు సూచించారు. దీంతో వాటిని కల్వకుర్తికి తరలించి, పొలాల్లో గుంత తీసి వాటిని పాతిపెట్టారు. అందులో శాంపిల్కు రెండు ముక్కలు కట్ చేసి, వాటిని హైదరాబాద్కు తీసుకొచ్చి కొనుగోలుదారుల కోసం ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు నరేందర్, శ్రీశైలం, షేక్ బుర్హాన్, నర్సింహులు కలిసి ఈ ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శాంపిల్స్తో మిధాని డిపో వద్దకు వచ్చిన షేక్ అబ్దుల్లా, ముజాహిద్దీన్, ఇనియాత్ ఖాన్, అబ్దుల్ ఖదీర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారిచ్చిన సమాచారంతో నలుగురిని అరెస్ట్ చేసి, కల్వకుర్తిలో దాచిపెట్టిన దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.