మహబూబ్నగర్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధి రాష్ట్ర సర్కార్ కేవలం ఏడేండ్లలో చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ‘ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే..’ అంటూ నాయకులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాల మాదిరిగా అనవసరంగా విమర్శలు చేసి తమ స్థాయి తగ్గించుకునేందుకు సిద్ధంగా లేమని, విమర్శలకు గూబ గుయ్మనేలా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సోమవారం గద్వాల, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్ నియోజకవర్గాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 25వ తేదీన జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, నవంబర్ 15న వరంగల్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు ఎస్.నిరంజన్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ద్విదశాబ్ది ఉత్సవాలకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు తప్పనిసరిగా కదలాలన్నారు. ఇందుకు సర్పంచ్, ఎంపీటీసీ, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలు బాధ్యత తీసుకోవాలని, వారే సొంతంగా బస్సులు ఏర్పాటు చేసుకొని వరంగల్కు మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకోవాలని సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు శ్రేణులకు సమాచారం అందించాలని జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. అత్యంత ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు చరిత్రలో నిలబడిపోయేలా జరపాలని పిలుపునిచ్చారు.
ప్లీనరీ కోసం ఆహ్వానాలు..
టీఆర్ఎస్ ప్లీనరీకి పార్టీ తరఫున హాజరయ్యే ప్రతినిధులకు ఆహ్వానం అందుతుందని ఉమ్మడి జిల్లా నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, సీ నియర్ నాయకులు.. ఇలా నియోజకవర్గానికి సుమారు 50 మంది వరకు హాజరయ్యేలా చూడాలన్నారు. పార్టీ అ ధ్యక్షుడి ఎన్నిక కనీవిని ఎరుగని రీతిలో ఉండాలన్నారు.
సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి..
పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమం విజయవంతం గా ముందుకు పోతున్నా.. పెద్ద ఎత్తున పార్టీ వ్యవస్థాగత నిర్మాణ కార్యాచరణ చేపట్టాల్సి ఉందని కేటీఆర్ పిలుపునిచ్చినట్లు సమాచారం. త్వరలో పార్టీ జిల్లా కార్యాలయాల ను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని, నవంబర్ 15న బహిరంగ సభ తర్వాత పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
ప్రతి గ్రామం నుంచి బస్సు..
ఈ నెల 25న హైదరాబాద్లో జరిగే ప్లీనరీతో పాటు వరంగల్లో జరిగే ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మంత్రి కేటీఆర్ గద్వాల, కొల్లాపూర్, వ నపర్తి, అలంపూర్ ని యోజకవర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్లీనరీకి నియోజకవర్గానికి 50 మంది వరకు, ద్విదశాబ్ది ఉత్సవాలకు ప్రతి గ్రామం నుంచి తప్పనిసరిగా కనీసం ఒక బస్సు కదలాలని ఆదేశించారు. నవంబర్ 15న వరంగల్లో జరిగే సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి. అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు.