అది కర్ణాటకలోని హడగళ్లి పట్టణం.. ఓ వ్యక్తి అంతిమయాత్ర సాగుతోంది. చనిపోయిన వ్యక్తిని కడసారి చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. రోడ్డు పక్కన ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించాడు. అయ్యో ఇంత మంచి మనిషి అకస్మాత్తుగా చనిపోయాడే అంటూ కన్నీరుమున్నీరు అయ్యేలా విలపించారు. అలా అని అతనేదో కుబేరుడో..రాజకీయ నాయకుడో.. లేదా ఇంకా ఏదైనా సెలబ్రెటీ అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అతను ఒక సాధారణ బిచ్చగాడు. అతని పేరు బసవ అలియాస్ హచ్చబస్య (45) రోడ్డు పక్కన అడుక్కుంటూ పొట్ట పోసుకుంటున్నాడు. మరి ఒక యాచకుడి చూసేందుకు అంతమంది ఎందుకు తరలివచ్చారని అనుకుంటున్నారా? అందుకు కారణం అతని మంచితనమే! అతనికి ఒక రూపాయి ఇచ్చి వెళ్తే మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతుంటారు. రూపాయి కంటే ఎక్కువ ఇచ్చినా మిగిలిన డబ్బు తిరిగి ఇచ్చేవాడు బసవ. అందుకే అక్కడి ప్రజలను బసవను ప్రేమగా అప్పాజీ అని పిలిచేవారు. అలాంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో శనివారం మృతి చెందాడు. దీంతో అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు హడగళ్లి ప్రజలంతా తరలివచ్చారు.