పోరాటాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన యోధుడు ఒకవైపు.. ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ మరోవైపు .. ఇద్దరూ కలిసి కుస్తీ పడుతున్నట్టు ఉన్న ఈ ఫొటో చూడముచ్చటగా ఉంది కదూ ! తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రగతి భవన్లో ఆవిష్కృతమైందీ దృశ్యం !!
తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రగతి భవన్లో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 2014లో జరిగిన ఓ సంఘటనను నిఖత్ జరీన్ గుర్తు చేసుకున్నారు. ఆనాడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రశంసించారని.. ఆ సమయంలో తన అభ్యర్థన మేరకు బాక్సింగ్కు ఫోజిచ్చారని తెలిపారు. అప్పుడు సీఎం కేసీఆర్ నింపిన స్ఫూర్తితోనే విశ్వ విజేతగా మారి నేడు మళ్లీ ఆయన ముందుకు వచ్చానని ఆనందం వ్యక్తం చేశారు. అప్పటిలాగే మరోసారి తనతో కలిసి బాక్సింగ్ ఫోజిచ్చి తనలో మరింత స్ఫూర్తి నింపాలని కోరారు. నిఖత్ జరీన్ కోరికను మన్నించిన కేసీఆర్.. ఆమెతో కలిసి పిడికిలి బిగించి చిరునవ్వు చిందించారు.