Bahadurpura Flyover | హైదరాబాద్లోని పాతనగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మౌలిక వసతులను గణనీయంగా పెంచుతూ వస్తున్నది. ఇందులో భాగంగానే పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం పాతనగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రూ 495.75 కోట్ల విలువైన ఆరు పనులకు పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రులతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా రూ.69 కోట్లతో బహదూర్పురలో 690 మీటర్ల పొడవునా నిర్మించిన మల్టీలెవల్ ఫ్లై ఓవర్ను కేటీఆర్ ప్రారంభించారు. బహదూర్పుర ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో రవాణా సమయం తగ్గడం, ఇంధన కాలుష్య నియంత్రణ, బహదూర్పుర జంక్షన్లో సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుంది. 13 పిల్లర్స్, ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఆరాంఘర్ నుంచి ఉప్పల్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం ఈజీగా సాగడంతోపాటు సకాలంలో గమ్యస్థానం చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.