నీటి అలలపై వెల్లకిలా పడుకుంటాడు.. నీళ్లలోనే ఆసనాలు వేస్తాడు.. యోగా ముద్రలో తేలియాడుతుంటాడు.. ఇలా తనదైన శైలిలో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరుకు చెందిన దండంరాజు రాంచందర్రావు. ఇప్పటికే హిందూమహాసముద్రం, కాళేశ్వరం జలాల్లో విన్యాసాలు చేసి ఔరా అనిపించాడు.
కొలనూర్లో ఊర చెరువు పెద్ద విస్తీర్ణంలో ఉంటుంది. ఎండకాలం వచ్చిందంటే చాలు పిల్లలంతా చేరి ఈతలు కొట్టేవారు. రాంచందర్రావు కూడా చిన్నతనంలో ఈతలో ఆసక్తి చూపాడు. తండ్రి, సోదరుల ప్రోత్సాహం.. స్నేహితుడు యాంసాని రాజమౌళితో కలిసి అనేక రకాల విన్యాసాలు నేర్చుకున్నాడు.
మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి బంధువుల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి, చెరువు మధ్యలోకి వెళ్లి నీటిపై పడుకొని ఉండడాన్ని చూసి అబ్బురపడ్డాడు. అతడి స్ఫూర్తితో నీటిలో పడుకునే విన్యాసాన్ని సాధన చేశాడు. ఉద్యోగరీత్యా సింగరేణిలో పనిచేస్తున్నప్పుడు గోదావరిఖని సింగరేణి ఈత కొలనులో కూడా అనేక రకాల విన్యాసాలను ప్రాక్టీస్ చేశాడు.
2012లో కాళేశ్వరం వెళ్లి అక్కడ పారుతున్న గోదావరిలో నీటిపై పడుకుని తేలుతూ విన్యాసం చేశాడు. అలాగే 2019 డిసెంబర్లో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని కన్యాకుమారి వెళ్లి అక్కడి హిందూ మహాసముద్రం అలలపైనా విన్యాసాలు ప్రదర్శించాడు.
ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొంది హైదరాబాద్లో స్థిరపడ్డాడు. స్వగ్రామం కొలనూర్ అంటే ఇంతో ఇష్టమని, నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ మదిలో మేదులుతూనే ఉంటాయని గుర్తు చేసుకున్నాడు.