ఐజాల్, డిసెంబర్ 8: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) నాయకుడు లాల్దుహోమా ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం రాజ్భవన్లో సీఎం లాల్దుహోమా, ఇతర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. 73 ఏండ్ల లాల్దుహోమాతోపాటు మరో11 మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఏడుగురికి క్యాబినెట్ హోదా దక్కగా, నలుగురికి సహాయ మంత్రిత్వంతో సరిపుచ్చారు. తాజా ఎన్నికల్లో ఓటమి చెందిన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) నేత, మాజీ సీఎం జోరంతంగా, మాజీ సీఎం లాల్ థాన్వాలా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 40మంది ఎమ్మెల్యేలతో కూడిన మిజోరం ప్రభుత్వంలో సీఎంతో కలుపుకొని మంత్రివర్గంలో గరిష్ట సభ్యుల సంఖ్య 12 మాత్రమే. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీఎం పార్టీ 27 స్థానాలు కైవసం చేసుకుంది. అధికార ఎంఎన్ఎఫ్ కేవలం 10 స్థానాలకు పరిమితమైంది. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం సీఎం లాల్దుహోమా విలేకరులతో మాట్లాడుతూ, 100 రోజుల్లో తన ప్రభుత్వం అమలుజేయబోతున్న 12 ప్రాధాన్య కార్యక్రమాల్ని వివరించారు. రాష్ట్ర రైతాంగానికి తన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ‘స్థానికంగా రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్నే మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అల్లం, పసుపు, మిరప.. మొదలైన వాటికి కనీస ధర ప్రకటిస్తాం. ఇది మా ప్రభుత్వానికి అత్యంత కీలకమైన అంశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది’ అని అన్నారు. 1977లో ఐపీఎస్గా ఎంపికైన లాల్దుహోమా, 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఇంచార్జ్గా పనిచేశారు.
మిజోరం యువ మహిళా ఎమ్మెల్యేగా బేరిల్
ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జెడ్పీఎం అధికార పగ్గాలు చేపట్టింది. 40 మంది సభ్యుల గల అసెంబ్లీలో ముగ్గురు మహిళలు విజయం సాధించగా, అందులో బేరిల్ వన్నెయిహసాంగి అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ఐజ్వాల్ దక్షిణం-3 నుంచి జోరమ్ పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) నుంచి ఎన్నికైన ఈ 32 ఏండ్ల యువతి తన ప్రత్యర్థిపై 9,370 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం పీజీ చేస్తున్న బేరిల్.. ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేటర్గా వ్యవహరించారు. టీవీ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందారు. ఈమెకు 2.51 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.