న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకొన్నది. దేశంలోని 225 చిన్న పట్టణాల్లో తమ సేవలను నిలిపివేసినట్టు ప్రకటించింది. ఆయా పట్టణాల్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి ప్రజల నుంచి స్పందన, ప్రోత్సాహం పెద్దగా లేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తన ఆర్థిక ఆదాయ రిపోర్టులో పేర్కొన్నది. ఫుడ్ డెలివరీ బిజినెస్ తగ్గడంతో 2022-23 మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో కంపెనీకి రూ.346.6 కోట్ల నష్టం వచ్చిందని తెలిపింది.
అక్టోబర్-డిసెంబర్లో మొత్తం నికర ఆర్డర్ల విలువలో ఈ 225 పట్టణాల నుంచి కేవలం 0.3 శాతం భాగస్వామ్యం మాత్రమే ఉన్నదని తెలిపింది. డిమాండ్లో నెలకొన్న ప్రస్తుత మందగమనం ఊహించనిది అని, ఫుడ్ డెలివరీ లాభాల వృద్ధిపై ఇది ప్రభావం చూపిందని కంపెనీ తన క్యూ3 నివేదికలో పేర్కొన్నది.