న్యూఢిల్లీ, ఆగస్టు 17: ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీకి కేంద్ర సర్కారు జడ్ క్యాటగిరీ వీఐపీ భద్రత కేటాయించినట్టు అధికారవర్గాలు బుధవారం వెల్లడించాయి. ఆలిండియా వ్యా ప్తంగా పేమెంట్ ప్రాతిపదికన సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రత కల్పిస్తారని తెలిపాయి.
ఇందుకు నెలకు రూ.15-20 లక్షల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నాయి. అదానీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర భద్రతా సంస్థల నుంచి వచ్చిన సూచనలతో భద్రత కల్పించాల్సిన వీఐపీల జాబితాలో ఆయన పేరును కేంద్రం చేర్చినట్టు వెల్లడించాయి. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సీఆర్పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ విభాగానికి కేంద్రం తాజాగా ఆదేశించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి 2013 నుంచే జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నది.