YS Sharmila | హైదరాబాద్ : వైఎస్సార్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై ఏఐసీసీ నాయకత్వంతో షర్మిల చర్చించనున్నారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు.
ఏఐసీసీ నాయకులతో చర్చలు జరిపిన అనంతరం వైఎస్సార్టీపీ విలీనంపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్టీపీ నాయకులతో షర్మిల మంగళవారం సమావేశమై చర్చించారు. ఇక జనవరి 4వ తేదీన వైఎస్ షర్మిల తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరే అవకాశం ఉంది.
ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు షర్మిల భర్త అనిల్కుమార్తో ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు చర్చించినట్టు సమాచారం. ఫైనల్గా షర్మిలతో కూడా ఈ విషయం మరోసారి చర్చించాక ఏఐసీసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. కర్ణాటక, తెలంగాణలో సాధించిన విజయాల స్ఫూర్తితో ఏపీలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నదని, ఇందులో భాగంగానే షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఏపీ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టడానికి షర్మిల ఇప్పడే అంగీకరించని పక్షంలో తొలుత పార్టీ స్టార్ క్యాంపెయినర్గా నియమించి, ఆ తర్వాత పార్టీ పగ్గాలు అప్పగించాలన్నది పార్టీ వ్యూహమని చెప్తున్నారు.లేదంటే షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉంది.