నేను ఎమ్మెల్యే మనవడిని.. అని ఓ యువకుడు బైక్ నెంబర్ ప్లేట్పై రాయించాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కన్యాకుమారి జిల్లాలోని నాగర్కోయిల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ మనవడిని.. అని చెప్పుకుంటూ ఓ యువకుడు తన బైక్ నెంబర్ ప్లేట్పై ఏకంగా నేను నాగర్కోయిల్ ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ మనవడిని అని రాయించాడు.
ప్రస్తుతం ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇక్కడే ఓ తిరకాసు ఉంది. ఎందుకంటే.. ఆ యువకుడు చెబుతున్నట్టుగా నాగర్ కోయిల్ ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీకి అసలు పెళ్లే కాలేదు. పెళ్లి కాకుండా మనవడు ఎలా వచ్చాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గత సంవత్సరం జరిగిన తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ.. ఏఐఏడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ బీజేపీ కేవలం 4 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. అందులో నాగర్ కోయిల్ నియోజకవర్గం ఒకటి. 1980 వ సంవత్సరం నుంచి ఎంఆర్ గాంధీ.. నాగర్ కోయిర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నాడు కానీ.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలిచాడు.
గాంధీకి పెళ్లి కాలేదు. తన కారు డ్రైవర్ కన్నన్నే తన సొంత మనిషిలా చూసుకుంటాడు గాంధీ. ఆ కన్నన్ కొడుకే ఈ యువకుడు అమ్రిష్. కన్నన్ను గాంధీ కొడుకులా చూసుకుంటాడు కాబట్టి.. గాంధీని తను తాతలా భావించి.. తాను ఎమ్మెల్యే మనవడిని అంటూ ఆ యువకుడు చలామణి అవుతున్నట్టుగా తెలుస్తోంది.
నిజానికి గాంధీ చాలా నిరాడంబరంగా ఉండే వ్యక్తి. అసెంబ్లీకి కూడా చాలా సాధారణంగా వెళ్తారు. ఆయన ఇటువంటివి అస్సలు ఎంకరేజ్ చేయరు. కానీ.. తన మీద అభిమానంతోనే ఆ యువకుడు అలా బైక్ నెంబర్ ప్లేట్ మీద తన పేరు రాయించుకున్నట్టు బీజేపీ నేతలు నెటిజన్లను కూల్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఆ యువకుడు చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.