దుర్గాపూర్: పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఓ విస్తుగొలిపే సంఘటన వెలుగు చూసింది. అనూహ్యంగా పెరిగిన ఫ్లేవర్డ్ కండోమ్ల విక్రయాలు స్థానిక దుకాణదారులను కలవరపెడుతున్నాయి. జిల్లాలో కొంత మంది యువకులు వీటిని గర్భనిరోధక సాధనాలుగా కాకుండా మత్తు పదార్థాలుగా ఉపయోగిస్తున్నారని తేలింది. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో కొంతమంది విద్యార్థులు కండోమ్లను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. వారు కండోమ్లను వేడి నీటిలో వేసి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల 10 నుంచి 12 గంటల వరకు మత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దుర్గాపూర్లోని దుర్గాపూర్ సిటీ సెంటర్, బిధాన్నగర్, బెనచిటి, ముచ్చిపర, సీ జోన్, ఏ జోన్ లాంటి వివిధ ప్రాంతాల్లో ఫ్లేవర్ కండోమ్ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఇంతకుముందు రోజుకు మూడు నుంచి నాలుగు కండోమ్ ప్యాకెట్లు మాత్రమే అమ్ముడుపోయేవని, ఇప్పుడు స్టోర్లో ఒక్క కండోమ్ ప్యాకెట్ కూడా మిగలడం లేదని ఓ మెడికల్ షాపు యజమాని తెలిపాడు.
దుర్గాపూర్ డివిజనల్ హాస్పిటల్లో పనిచేస్తున్న ధీమాన్ మండల్ ఈ విచిత్రమైన వ్యసనానికి కారణాన్ని వివరించాడు. ‘కండోమ్లలో సుగంధ సమ్మేళనాలు ఉంటాయి. వేడిచేసినప్పుడు ఇవి విచ్ఛినమై ఆల్కహాల్ సమ్మేళనం ఏర్పడుతుంది. ఈ సుగంధ సమ్మేళనం డెండ్రైట్స్ జిగురులో కూడా ఉంటుంది. చాలా మంది మత్తు కోసం దీన్ని కూడా ఉపయోగిస్తారు.’ అని వివరించాడు. అలాగే, దుర్గాపూర్ ఆర్ఈ కాలేజ్ మోడల్ స్కూల్ కెమిస్ట్రీ టీచర్ నూరుల్ హక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కండోమ్స్ డిమాండ్ గణనీయంగా పెరగడంపై స్థానిక యంత్రాంగం ఆందోళన చెందింది. దీంతో కండోమ్లు.. దగ్గు సిరప్, హ్యాండ్ శానిటైజర్, ఆఫ్టర్ షేవ్ లోషన్, స్నిఫింగ్ జిగురు, పెయింట్, నెయిల్ పాలిష్, వైట్నర్లలాంటి వ్యసనానికి ఉపయోగించే వస్తువుల జాబితాలో చేరాయి. కాగా, ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇంకా స్పందించలేదు.