కొచ్చి, సెప్టెంబర్ 1: వస్తువులను ‘వాడి పడేసే (యూజ్ అండ్ త్రో)’ సంస్కృతి ఈ రోజుల్లో చాలామందిలో పెరిగినట్టే.. పెండ్లి వయసుకు వచ్చిన యువతలో కూడా ‘యూజ్ అండ్ త్రో’ పోకడ పెరిగిపోయిందని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని యువత.. పెండ్లంటే ‘భారం’గా భావిస్తున్నారని పేర్కొన్నది. రోజురోజుకూ సహజీవనం పెరుగుతున్నదని, స్వార్థపూరిత కారణాలతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పెండ్లిని ఓ భూతం మాదిరిగా నేటి యువతరం భావిస్తున్నదని, బాధ్యతలు లేని జీవితం ఆస్వాదించేందుకు పెండ్లి వద్దనుకుంటున్నారని తెలిపింది.
భార్యను ‘ఎప్పటికీ ఆహ్వానించే దుఃఖం’ అని పేర్కొంటున్నారని చెప్పింది. ఓ వ్యక్తి దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను తోసిపుచ్చిన సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వేరే మహిళతో సంబంధం పెట్టుకుని తొమ్మిదేండ్ల వివాహ బంధాన్ని, ముగ్గురు కూతుర్లను పిటీషనర్ కాదనుకుంటున్నాడని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకప్పుడు దేవభూమి అయిన కేరళలో పెండ్లి అంటే చాలా పవిత్రంగా చూసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది.