సీజేఐ జస్టిస్ రమణ
న్యూఢిల్లీ, జూన్ 24: ప్రజాస్వామ్య ప్రాముఖ్యాన్ని గ్రహించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. వారి చురుకైన భాగస్వామ్యం ద్వారా ప్రజాస్వామ్యం కొనసాగడంతో పాటు మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. అమెరికాలో న్యూయార్క్లోని కొలంబియాలో యూనివర్సిటీని గురువారం సందర్శించిన సీజేఐ, అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా అయిన బీఆర్ అంబేద్కర్కు నివాళులర్పించారు. స్వాతంత్య్రం తర్వాత భారత్ ఇప్పటి వరకు చేసిన 75 ఏండ్ల ప్రయాణం ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ గొప్ప దార్శనికుడు, స్ఫూర్తిప్రధాత అని, ఆయన నేతృత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం తనలాంటి సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వ్కక్తులకు ఉన్నత అవకాశాలు కల్పించిందని సీజేఐ పేర్కొన్నారు.