న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలను (Farm Laws) కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో.. రైతుల త్యాగాలు ఫలించాయని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో ముందడుగు వేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై విజయం సాధించిన రైతులను అభినందించారు.
కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద సాగు చెట్టాలను చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. గతేడాది నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. దాదాపు ఏడాదిగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. రైతులకు క్షమాపణలు చెప్పారు.
‘నల్ల చట్టాలను రద్దు చేయడం సరైన దిశలో ఒక అడుగు. కిసాన్ మోర్చా చేస్తున్న సత్యాగ్రహం చారిత్రక విజయం సాధించింది. మీ త్యాగం డివిడెండ్లను చెల్లించింది’ అని సిద్ధూ ట్వీట్ చేశారు.