Lucknow : ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో దారుణం జరిగింది. మూసి ఉన్న ఒక వెజ్ బిర్యానీ షాపు ఫ్రీజర్లో యువకుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. తన షాపులోని ఫ్రీజర్లో మృతదేహం కనిపించడంతో షాపు యజమాని షాకయ్యాడు. ఈ ఘటన స్థానికుల్ని కూడా షాక్కు గురి చేసింది. దీనిపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. లక్నో, బక్షి కా తలాబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో, జీసీఆర్జీ అనే కాలేజీ సమీపంలో ఒక వెజ్ బిర్యానీ షాపు ఉంది.
ఈ షాపు యజమాని నాలుగు రోజుల క్రితం షాపును మూసేసి తన తండ్రి అంత్యక్రియల కోసం వెళ్లాడు. అనంతరం తిరిగి వచ్చిన తర్వాత షాపు ఓపెన్ చేసి, ఫ్రీజర్లో చూడగా, యువకుడి మృతదేహం కనిపించింది. అంతే.. ఫ్రీజర్లో యువకుడి మృతదేహం కనిపించడతో యజమాని షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని, యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. మృతుడికి సంబంధించిన వివరాలేవీ ఇంకా తెలియరాలేదు. మూసేసిన షాపులోకి మృతదేహం ఎలా వచ్చిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
షాపు యజమానిని ప్రశ్నిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు. అతడు ఎలా మరణించాడు.. మృతదేహం ఎలా అక్కడికి వచ్చింది.. వంటి వివరాల్ని ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దీనిపై విచారణ జరుపుతున్నట్లు డీసీపీ గోపాల్ క్రిష్ణ చౌదరి తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు నిఘాను పటిష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.